మమతా చీరకు బదులు బెర్ముడా షార్ట్స్ ధరించాలి... బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి షాకింగ్ కామెంట్స్...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్,బీజేపీ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. వ్యక్తిగత విమర్శలకు కూడా నేతలు వెనుకాడట్లేదు. తాజాగా బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె వస్త్రధారణను కించపరిచేలా మాట్లాడారు. మమతా ఒక కాలు బయటకు కనిపించేలా... మరో కాలు కనిపించకుండా చీర కట్టుకుంటున్నారని... ఇలా చీర కట్టుకోవడం తానెక్కడా చూడలేదని అన్నారు. అంతేకాదు,ఒకవేళ మమత తన కాళ్లను అందరికీ చూపించాలనుకుంటే... చీరకు బదులు షార్ట్స్ ధరించాలని సూచించారు.
దిలీప్ ఘోష్ ఏమన్నారు...
'మమత గాయమైన కాలికి ఇప్పుడు కట్లు తొలగించారు. కట్లకు బదులు బ్యాండేజ్ వేసుకున్నారు. ఆ బ్యాండేజ్ వేసుకున్న కాలు కనిపించేలా.. మరో కాలు కనిపించకుండా ఆమె చీర కట్టుకుంటున్నారు. ఇలా చీర కట్టుకునేవాళ్లను నేనెప్పుడూ చూడలేదు.ఒకవేళ ఆమె తన కాళ్లు చూపించాలనుకుంటే... చీరకు బదులు బెర్ముడా షార్ట్స్ ధరించాలి.' అని దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. పురులియా పట్టణంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్లో ఘోష్కు గట్టి ఇచ్చారు.
టీఎంసీ నేతల కౌంటర్...
'ఒక బహిరంగ సభలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు మమతా బెనర్జీ చీర కట్టు గురించి మాట్లాడుతున్నాడు. ఆమె బెర్ముడా షార్ట్స్ వేసుకోవాలని చెప్తున్నాడు. ఇంత దిగజారిన ఈ కోతులు బెంగాల్లో గెలుస్తామని అనుకుంటున్నారు...' అంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు.మరో టీఎంసీ నేత కాకోళి ఘోష్ కూడా ఘాటుగా స్పందించారు. 'బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడి హోదా కేవలం విషం చిమ్మే స్థాయికి దిగజారింది. టీఎంసీ కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి మమతపై దాడి వరకూ దిలీప్ ఘోష్ అన్ని హద్దులు దాటాడు. ఆయన వ్యాఖ్యలు షాకింగ్గా ఉన్నాయి...' అని పేర్కొన్నారు.
వీల్ఛైర్లోనే మమత ప్రచారం...
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రాంలో ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆమె కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఆమె తన వాహనంలోకి ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు తనను నెట్టేశారని... కాలిని తొక్కారని మమతా ఆరోపించారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరిన ఆమె రెండు రోజుల తర్వాత డిశ్చార్జి అయ్యారు. కాలికి కట్టుతో వీల్ చైర్లోనే ఆమె ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్లో టీఎంసీ,బీజేపీ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు అవకాశమిస్తే బెంగాల్లో 70 ఏళ్ల అభివృద్ది చేసి చూపిస్తానని ప్రధాని మోదీ చెప్తున్నారు. మరోవైపు దుర్యోధన,దుశ్వాసనులు మనకు వద్దు అని మమతా బెనర్జీ ప్రచారం చేస్తున్నారు.