ఆడపులి పంజా: మమత విజయ రహస్యం ఇదే -మోదీకి చుక్కలు చూపెడదాం -బెంగాల్ ఫలితంపై జాతీయ నేతలు
10ఏళ్లు పాలనలో ప్రభుత్వ వ్యతిరేకతను సైతం అధిగమిస్తూ,ఎగ్జిట్ పోల్ అచనాలను తలకిందులు చేస్తూ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ద్వయాన్ని చిత్తుగా ఓడిస్తూ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఘన విజయం సాధించింది. ఆదివారం నాటి ఫలితాల్లో ఈసీ అధికారిక లెక్కల ప్రకారం.. మొత్తం 294 సీట్లకుగానూ 286చోట్ల ఫలితాలు వెలువడగా, మధ్యాహ్నం 3గంటల వరకే టీఎంసీ 201 సీట్లలో లీడింగ్ లో ఉంది. బీజేపీ 80 సీట్లలో ఆధిక్యాన్ని కనబర్చుతుండగా, కాంగ్రెస్ 1, ఇండిపెండెండ్లు ఇద్దరు, ఆర్ఎస్ఎంపీ ఒక చోట లీడ్ లో ఉన్నారు. దీంతో..
మమత బంపర్ విక్టరీ..
దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాలకూ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, బీజేపీ జోరు, మోదీ-షా హోరు కారణంగా పశ్చిమ బెంగాల్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రెండేళ్ల కిందటి లోక్ సభ ఎన్నికల్లో 42శాతం ఓట్లు, 19 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 37శాతం ఓట్లతో 80లోపు స్థానాలకే పరిమితమైంది. టీఎంసీ ఏకంగా 48.4శాతం ఓట్లతో 200ప్లస్ సీట్లు సాధించి వహ్వా అనిపించింది.
మోదీ, షా, బీజేపీ పెద్దల ప్రచారానికి అనుకూలంగా ఎనిమిది దశల్లో పోలింగ్, భారీ ఎత్తున కేంద్ర బలగాల మోహరింపు, దేశం నలుమూలల నుంచి బీజేపీ నేతల రాక, బూత్ ల వారీగా బీజేపీ పక్కా ప్రణాళిక.. ఇవేవీ టీఎంసీ గెలుపును అడ్డుకోలేకపోయాయి. కాగా, బెంగాల్ లో వరుసగా మూడో సారి మమత విజయఢంకా మోగించడం వెనుక కీలక వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి..
సెక్యులరిజం ఈజ్ ద సీక్రెట్
బెంగాల్ అసెంబ్లీ పోరులో మమతా బెనర్జీ విజయ రహస్యం సెక్యులరిజమే అని టీఎంసీ కీలక నేత ఫిర్హాద్ హకీమ్ చెప్పారు. ''మతతత్వ బీజేపీని అడ్డుకోవాలంటే ప్రజలందరినీ ఏకతాటిపైకి తేవడం ఒక్కటే మార్గం. బీజేపీకి వ్యతిరేకంగా జరిపే పోరాటం కచ్చితంగా లౌకికంగానే ఉండాలి. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సరిగ్గా దాన్నే ఫాలో అయ్యారు. మత శక్తులకు వ్యతిరేకంగా, బెంగాల్ అభివృద్ధి కోసం ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మేం సక్సెస్ అయ్యాం. బీజేపీని ఢీకొట్టడానికి ఇతర పార్టీలు చేసిన ప్రయత్నాలు, మమత విధానానికి ప్రధానమైన తేడా ఇదే. అలాంటి మమతను ఇరుకున పెట్టాలని చూసి కమ్యూనిస్టులు ఈ ఎన్నికలతో పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయారు'' అని హకీమ్ వ్యాఖ్యానించారు. ఇక
ఆడపులి గెలిచింది.. ఆట మిగిలింది..
బెంగాల్ పోరులో బీజేపీని మట్టికరిపిస్తూ మమతా బెనర్జీ ఆడపులిలా విక్టరీ సాధించిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ, దానికి అనుబంధంగా పనిచేసిన ఈసీలు ఎన్నిరకాల కుటిల యత్నాలు చేసినా ఎదురుదెబ్బతీసి గెలుపొందిన తీరు అమోఘం అంటూ ఎన్సీ నేత, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కొనియాడారు. బెంగాల్ గెలుపు తర్వాత రాబోయే కాలంలో జాతీయ స్థాయిలోనూ మమతతో కలిసి పనిచేసి, మోదీని దెబ్బతీద్దామనే అర్థంలో ఎన్సీపీ అధినేత శరద్ పవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ''మమతా జీ.. అభినందనలు. ప్రజల సంక్షేమం, మహమ్మారిని సమిష్టిగా ఎదుర్కోడానికి మనమిక కలిసికట్టుగా పనిచేద్దాం''అని పవార్ ట్వీట్ చేశారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం మమతకు విషెస్ చెప్పారు.