పిల్లలు లేరని భార్యను సుత్తితో మోది చంపిన భర్త, ఆపై ఆత్మహత్య
ముంబై: పెళ్లై ఎనిమిది సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టలేదనే కారణంతో కట్టుకున్న భార్యను సుత్తితో కొట్టి చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముంబై శివార్లలోని పొవాయ్లో చోటు చేసుకుంది. పవాయ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ బీకే మహదేశ్వర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సురేశ్ బీజ్ అనే వ్యక్తి ముంబైలో రోజు వారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రీతి అనే ఆమెతో ఇతడికి వివాహం జరిగింది. పెళ్లై ఇంతకాలమైనా పిల్లలు లేరని భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. వీరికి సమీప బంధువులు కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారు.
అయితే బుధవారం సాయంత్రం వీరి ఇంటికి వచ్చిన బంధువులు తలుపులు మూసి ఉండటాన్ని చూసి తలుపు తెరవాలంటూ కొట్టారు. ఎంతకూ తలుపు తెరవక పోవడంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. దీంతో కిందపడి చనిపోయి ఉన్న ప్రీతిని చూసి ఒక్కసారిగా వారు షాక్కు గురయ్యారు.
ఆమె పక్కనే భర్త కూడా సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఉండటం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రీతి తలపై సుత్తితో బలంగా మోది, ఆమె చేతి నరాలు తెంచినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులకు చెప్పారు.
పోస్టుమార్టం నివేదికలో కూడా ఆమె తలపై సుత్తితో బలంగా మోదినట్లు రిపోర్టు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఇక ఆమె భర్త సురేశ్ ఉరేసుకుని చనిపోయినట్లు రిపోర్టుల్లో ఉందని తెలిపారు. రిపోర్టుల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
పిల్లలు పుట్టలేదనే కారణంతో సురేశ్, ప్రీతిలు తరచూ గొడవపడేవారని విచారణలో భాగంగా బాధితురాలి తల్లి పోలీసులకు వెల్లడించినట్లు తెలిపారు.