ప్రధాని నరేంద్ర మోడీపై రసాయన దాడి బెదిరింపు, నిందితుడి అరెస్ట్
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీపై రసాయన దాడి చేస్తానని బెదిరింపులకు పాల్పడిన 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. అతని పేరు కాశీనాథ్ మండల్. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతనిని సెంట్రల్ ముంబై డీబీ మార్గ్ పోలీసులు అరెస్టు చేశారు.
అతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కంట్రోల్ రూంకు ఫోన్ చేసి ప్రధాని మోడీపై రసాయన దాడి జరుపుతానని హెచ్చరించాడు. అతను శుక్రవారం ఈ హెచ్చరికలు జారీ చేశాడు. అదే రోజున అతనిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అతను ఢిల్లీలోని ఎన్ఎస్జీ కంట్రోల్ రూమ్ నంబరుకు ఫోన్ చేశాడని, ప్రధానిపై రసాయన దాడికి పాల్పడతానంటూ అధికారులను హెచ్చరించాడని, తమకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా నంబర్ను ట్రాక్ చేసి అతనిని పట్టుకున్నట్లు తెలిపారు.
ఫోన్ కాల్ ముంబై నుంచి వచ్చిందని తెలుసుకొని, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాశీనాథ్ను వెంటనే అరెస్టు చేశారు. అతడిని జార్ఖండ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ముంబైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సూరత్ వెళ్లే రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు.