ఇరుగుపొరుగు చాడీలు: కూతుర్ని కొట్టి చంపిన తండ్రి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో దారుణం జరిగింది. ఇరుగుపొరుగువారు చెప్పిన వదంతులను నమ్మి ఓ వ్యక్తి తన కన్న కూతుర్నే(13) దారుణంగా కొట్టి చంపాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని మంగళవారం అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. హథిదోల్ గ్రామంలో నివాసం ఉంటున్న నిందితుడు రాంధాని రాథోర్(40), సోమవారం సాయంత్రం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో కొందరు ఇరుగుపొరుగువారు అతని వద్దకు చేరి అతని కూతురు ప్రియాంకపై చాడీలు చెప్పారు.
స్థానిక పాఠశాలలో ప్రియాంక 7వ తరగతి చదువుతోంది. కాగా, వీధుల వెంట తిరుగుతోందని ఆమె గురించి ఇరుగుపొరుగువారు రాంధానికి చాడీలు చెప్పారు.
అప్పటికే మద్యంమత్తులో ఉన్న రాంధాని.. ప్రియాంకను కర్రలతో తీవ్రంగా కొట్టాడు. దీంతో దెబ్బలకు తాళలేని ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడిపై కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితుడు రాంధాని రాథ్ర్ను అదుపులోకి తీసుకున్నారు.