మోడీ ప్రచార బృందంలోని వ్యక్తి, బీహార్ ఎన్నికల్లో నితీష్ కోసం
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్.. రాబోయే బీహార్ ఎన్నికలకు ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ పక్షాన ప్రచారం నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. అతని వయస్సు 37.
అతను కొన్నేళ్ల క్రితం ఆఫ్రికా నుండి వచ్చారు. నరేంద్ర మోడీ ఎన్నికల వ్యూహం టీంలో ఉన్నారు. మరికొన్ని నెలల్లో జరగనున్న బీహార్ ఎన్నికల కోసం అతను ప్రస్తుతం అక్కడ ఉన్నారు.
అతను ఐక్యరాజ్య సమితి ఉద్యోగాన్ని వదులుకొని మోడీ ప్రచార బృందంలో చేరాడు. చాయ్ పే చర్చా, త్రీడీ హోలోగ్రాం కార్యక్రమాల రూపకర్త కిషోర్. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ప్రజలను చైతన్యవంతం చేయడమే తన పని అని కిషోర్ చెబుతున్నాడు. అతను బుధవారం మాట్లడుతూ.. భారతీయ జనతా పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తాను గతంలో కేవలం మోడీ కోసమే పని చేశానని చెప్పాడు.
ఈసారి నితీష్ కుమార్ కోసం పని చేస్తారా అంటే స్పష్టత ఇవ్వలేదు. బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ తరఫున పని చేసేందుకు అతను సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జేడీయూ ఎంపీ, నితీష్ వ్యక్తిగత సలహాదారు పవన్ వర్మ మాటలాడుతూ.. నితీష్ కోసం కిషోర్ పని చేస్తారన్నారు.