తొందరపడ్డ పెళ్లి కొడుకు... రిస్క్లో 100 మంది... చివరికిలా బుక్కయ్యాడు...
మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఓ నవ వరుడిపై కేసు నమోదైంది. కరోనా అనుమానిత లక్షణాలతో ఉన్న ఆ యువకుడికి ఇటీవల పరీక్షలు నిర్వహించారు. అయితే టెస్ట్ రిజల్ట్ వచ్చేంతవరకు వేచి చూడకుండానే అతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి పాజిటివ్గా తేలడంతో పెళ్లికి వచ్చినవారందరూ రిస్క్లో పడ్డట్టయింది.దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు నవ వరుడితో పాటు అతని తల్లి,బంధువులపై కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. పాల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేల్ఘర్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ యువకుడికి ఇటీవల కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా టెస్టింగ్ కోసం స్వాబ్ శాంపిల్స్ ఇచ్చాడు. అయితే ఇంతకుముందే అతనికి పెళ్లి నిశ్చయించడంతో.. అనుకున్న తేదీకి జూన్ 11న వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కరోనా ఫలితాలు రాగా పాజిటివ్గా నిర్దారణ అయింది.
పెళ్లికి సుమారు 100 మంది వరకు హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. నిబంధనల ప్రకారం పెళ్లికి 50 మందే హాజరుకావాలని.. కానీ అతను వాటిని ఉల్లంఘించాడని అంటున్నారు. పాజిటివ్గా తేలాక స్థానిక అధికారులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆ పెళ్లికి వచ్చిన కాంటాక్ట్స్ను వెతికే పనిలో ఉన్నట్టు స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 1,20,504 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకూ 5751 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకూ 53,902 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.