తలుపు పెట్టి ఇద్దరు కూతుళ్లను నరికి చంపిన తండ్రి
బెంగళూర్: కర్ణాటకలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 45 ఏళ్ల వ్యక్తి ముగ్గురు కూతుళ్లపై దాడి చేసి, ఇద్దరిని నరికి చంపాడు. సోమవారం సాయంత్రం తుంగానగర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాడిలో ఇద్దరు చిన్న కూతుళ్లు చనిపోగా, పెద్ద కూతురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అప్పు ఇచ్చినవారు తన ఆటోను స్వాధీనం చేసుకోవడంతో తీవ్రంగా కలత చెందిన రమేష్ అనే ఆ ఆటో డ్రైవర్ బిడ్డలను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. రమేష్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు.
మొనిషా (7), మోనికా (10) మరణించగా, ధరణి (14) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బెంగళూర్కు 12 కిలోమీటర్ల దూరంలో మగది తాలుకాలో తుంగానగర్ ఉంటుంది. రమేష్ అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.
గౌరమ్మ పనికి వెళ్లిన సమయంలో రమేష్ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి దాడి చేసినట్లు చెబుతున్నారు. ఇంట్లోకి వచ్చిన రమేష్ తలుపులు పెట్టేసి, వంటింట్లోకి వెళ్లి పెద్ద కత్తి తీసుకున్నాడు. తొందర్లో కొన్ని పాత్రలను పడేశాడు కూడా.