రూ. 10 ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపాడు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్యాభర్తల మధ్య రూ.10 కోసం మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. చివరికి ఆ వ్యక్తి తన భార్యను హత్య చేసేందుకు దారితీసింది.
పోలీసుల కథనం ప్రకారం... అశోక్(61)అనే వ్యక్తి భార్య రాణి(42)ని పది రూపాయలివ్వమని అడిగాడు. ఆమె ఇవ్వనంది. దీంతో వారిద్దరి మధ్యా గొడవ ప్రారంభమైంది. కోపోద్రిక్తుడైన అశోక్ వంటింట్లోంచి కత్తి తెచ్చి ఆమెను పొడిచి చంపాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
రక్తపు మడుగులో శవమై పడి ఉన్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశోక్కు రాణి రెండో భార్య అని స్థానికులు చెప్పారు. రాణికి కూడా అతనితో రెండో పెళ్లి అని చెప్పారు. మొదటి భర్తతో కలిగిన ఇద్దరు కొడుకులను రాణితో తనతోపాటు తీసుకొచ్చిందని తెలిపారు.
ఘటన జరిగిన సమయంలో ఆమె పిల్లలిద్దరూ పాఠశాలలో ఉన్నారని పోలీసులు చెప్పారు. రూ. 10 కోసం గొడవపడి తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు అశోక్ తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేసి, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
ఉత్తర ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలోకాశీ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బైక్ను వేగంగా వస్తున్న జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జీపు డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు.