వ్యక్తి సజీవ దహనమవుతుంటే వీడియో తీశారు
లక్నో: మనుషుల్లో మానవత్వం కరవవుతుందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటే అది చూస్తున్న స్థానికులు అతడ్ని రక్షించాల్సింది పోయి తమకేమీ పట్టనట్లుచూస్తూండిపోయారు.
అంతటితో ఆగకుండా తమ ఫోన్లలో వీడియోలు తీస్తూ కూర్చున్నారు. ఆఖరికి అతను సజీవదహనమయ్యాడు. ఈ దౌర్భాగ్యమైన ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని జాన్పూర్లో చోటు చోటుచేసుకుంది.
వివరాల్లో వెళితే.. స్థానిక జాన్పూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్కి ఆయేషా అనే యువతితో వివాహమైంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఫిరోజ్ తన భార్యకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్దామనుకున్నాడు. కానీ, ఆయేషా ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో ఫిరోజ్ నడిరోడ్డు మీద నిలబడి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత రక్షించమని కేకలు వేశాడు. అక్కడ చేరిన గుంపులో చాలామంది చూస్తూ ఉండిపోయారు. కొందరు వీడియో కూడా చిత్రీకరించారు. అయితే, మరికొందరు అతడ్ని రక్షిద్దామని ముందుకు వచ్చారు, కానీ, అంతలోనే ఫిరోజ్ కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.
మహిళపై యాసిడ్ పోసిన దుండగులు
ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అలీగఢ్ జిల్లాలోని ఖైర్ ప్రాంతంలో ఆదివారం ఓ 30ఏళ్ల మహిళపై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు యాసిడ్ పోసి పరారయ్యారు. ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి వెళ్లి ఆమెపై యాసిడ్ పోసి పారిపోయారు.
గమనించిన స్థానికులు ఆమెను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.