కేజ్రీవాల్ను కాల్చిపారేస్తానని అగంతకుడి బెదిరింపు కాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కాల్చిపారేస్తానంటూ.. ఫోన్ కాల్ రావడంతో.. ఒక్కసారిగా ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడి గురించి ఆరా తీయగా.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఓ మతిస్థిమితం లేనివాడని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బుధవారం మధ్యాహ్నాం చంఢీఘడ్ నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు సీఎం కేజ్రీవాల్. ఇదే క్రమంలో సాయంత్రం 6.16గం.ల ప్రాంతంలో ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కేజ్రీవాల్ ఢిల్లీలో అడుగుపెట్టగానే కాల్చిపారేస్తానని అవతలి వైపు నుంచి ఓ అగంతకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు.
క్షణాల వ్యవధిలో పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ఉన్నతాధికారులు.. నిందితుడి గురించి వివరాలు సేకరించారు. నిందితుడు తూర్పు ఢిల్లీలోని ఖజూరి ఖాస్ కు చెందిన రవీందర్ కుమార్ అనే వ్యక్తిగా గుర్తించారు. అయితే అతనో తాగుబోతని, మతిస్థిమితం సరిగా లేక అలా వ్యవహరిస్తున్నాడని స్థానికులు పోలీసులకు వివరించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.