అలా జరగాలని?: భార్యా పిల్లల ముందే ఆ ఇద్దరు భర్తలు..
సక్రామ్, రాకేశ్ లను పెళ్లి కుమార్తెలుగా భావించి ఇంద్రుడు(వరుణదేవుడు)తో వారి వివాహం జరిపించినట్లు పెళ్లి పెద్ద చెప్పారు.
ఇండోర్: వర్షాల కోసం కప్పల పెళ్లిళ్లు చేయడం.. యాగాలు చేయడం చూసుంటారు కానీ ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకున్న ఘటన ఎక్కడైనా చూశారా?.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించాలని కోరుతూ ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకున్నారు.
ఇండోర్కు చెందిన సక్రామ్ ఆశీర్వార్, రాకేశ్ అద్జన్ లు హిందూ సంప్రదాయం ప్రకారం గురువారం వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు చుట్టు పక్కల జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువతీ యువకులు డ్యాన్సులతో అలరించారు.
నైరుతి రుతుపవనాలు సరైన వర్షాలు కురిపించని నేపథ్యంలో.. వరుణదేవుడు అనుగ్రహించాలని అక్కడివారు ఈ పెళ్లి జరిపించారు. దీనిపై స్పందించిన పెళ్లి పెద్ద రమేశ్ సింగ్ తోమర్.. సక్రామ్, రాకేశ్ లను పెళ్లి కుమార్తెలుగా భావించి ఇంద్రుడు(వరుణదేవుడు)తో వారి వివాహం జరిపించినట్లు చెప్పారు.
కాగా, సక్రామ్. రాకేశ్ లకు పెళ్లిళ్లయి పిల్లలు కూడా ఉండటం గమనార్హం. కుటుంబ సభ్యుల ఎదుటే వీరు వివాహం చేసుకోవడం మరో విడ్డూరం. వీరిద్దరు రమేశ్ సింగ్ తోమర్ వద్ద పనిచేస్తున్నారు. ఈ ఆలోచనకు ఆయనే కారణమని, వర్షాలు కురుస్తాయని చెప్పడంతోనే ఇలా చేశామని వారు చెబుతున్నట్లు సమాచారం.
వివాహ తంతు పూర్తయిన తర్వాత సక్రామ్, రాకేశ్ లు తమ భార్యా పిల్లలతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నప్పటికీ.. వర్షం మాత్రం కురవకపోవడం గమనార్హం.