Mangal Pandey: భారత సైనికులను బలవంతంగా క్రైస్తవులుగా మారుస్తున్నారని వదంతులు వచ్చినప్పుడు ఏం జరిగింది?
మంగళ్ పాండే 1827 జులై 19న పుట్టారు. ఆయనకు 1857 ఏప్రిల్ 8న ఉరిశిక్ష అమలు చేశారు.
స్థానిక తలారులు మంగళ్ పాండేను ఉరి తీయడానికి ఒప్పుకోకపోవడంతో, కోల్కతా నుంచి నలుగురు తలారులను పిలిపించి ఆయనను ఉరి తీశారు.
కానీ మంగళ్ పాండే తనను ఉరి తీయడానికంటే చాలా రోజుల ముందే ఆత్మహత్యాయత్నం చేశాడనేది చాలా కొద్ది మందికే తెలిసిన విషయం. ఆ ప్రయత్నంలో ఆయన గాయపడ్డారు కూడా.
1857 మార్చిలో జరిగిన ఘటన
అది 1857 సంవత్సరం. మార్చి 29. మంగళ్ పాండే 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీతో బారక్పూర్లో మొహరించి ఉన్నారు. అదే సమయంలో సిపాయిలను బలవంతంగా క్రైస్తవులుగా మారుస్తున్నారంటూ రకరకాల వదంతులు వ్యాపించడం మొదలైంది.
భారత సైనికులను చంపడానికి యూరోపియన్ సైనికులు భారీగా వస్తున్నారని మరో వదంతి కూడా జోరందుకుంది.
చరిత్రకారుడు కిమ్ ఎ వాగనర్ తన 'ద గ్రేట్ ఫియర్ ఆఫ్ 1857-రూమర్స్, కాన్స్పయిరీస్ అండ్ మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ అప్రైజింగ్' పుస్తకంలో మార్చి 29న జరిగిన ఆ ఘటనను వర్ణించారు.
"సిపాయిల మనసులో గూడుకట్టుకున్న భయాన్ని పోగొట్టేందుకు, యూరోపియన్ సైనికులు భారత సైనికులపై దాడి చేయడం అనేది వదంతి అని మేజర్ జనరల్ జేబీ హియర్సీ కొట్టిపారేశారు. కానీ సిపాయిల వరకే చేరిన ఆ వదంతుల గురించి మాట్లాడిన హియర్సీ వాళ్లను మరింత భయపెట్టి ఉండొచ్చు. ఆయన మాటల వల్ల భయపడ్డ వారిలో 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ సిపాయి మంగళ్ పాండే కూడా ఉన్నారు" అని రాశారు.
రక్తమోడిన మార్చి 29 సాయంత్రం
మార్చి 29న సాయంత్రం ఆ ఘటనకు ముందు మంగళ్ పాండే తన తుపాకీ శుభ్రం చేస్తున్నారని వాగనర్ రాశారు.
"సాయంత్రం 4 గంటలు. మంగళ్ పాండే తన గుడారంలో తుపాకీ శుభ్రం చేసుకుంటున్నారు. కాసేపటి తర్వాత ఆయనకు యూరోపియన్ సైనికుల విషయం తెలిసింది. సిపాయిలు బెదిరిపోయి ఉండడంతో, గంజాయి మత్తులో ఉన్న మంగళ్ పాండే భయపడిపోయారు. అధికారిక టోపీ, జాకెట్, ధోవతితో ఉన్న పాండే తన కత్తి, తుపాకీ తీసుకుని క్వార్టర్ గార్డ్ బిల్డింగ్ దగ్గరున్న పరేడ్ గ్రౌండ్ వైపు పరిగెత్తారు.
మంగళ్ పాండే బ్రిటన్ సైనిక అధికారులపై దాడి చేసిన ఘటనను బ్రిటన్ మహిళా చరిత్రకారులు రోజీ లిల్వెలన్ జోన్స్ తన 'ద గ్రేట్ అప్రైజింగ్ ఇన్ ఇండియా, 1857-58 అన్టోల్డ్ స్టోరీస్ అండ్ బ్రిటిష్' పుస్తకంలో రాశారు.
"కత్తి, తుపాకీ తీసుకున్న మంగళ్ పాండే క్వార్టర్ గార్డ్(బిల్డింగ్) ముందు తిరుగుతూ తన రెజిమెంటులో వారిని రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. యూరోపియన్ సైనికులతో తమను అంతం చేస్తారని చెప్పి రెజిమెంట్ సైనికులను రెచ్చగొడుతున్నారు. సార్జంట్ మేజర్ జేమ్స్ హ్యూసన్ ఏం జరుగుతోందో తెలుసుకోడానికి నడిచి బయటకు వచ్చారు. ఆ మొత్తం ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన హవల్దార్ షేఖ్ పల్టూ వివరాల ప్రకారం పాండే హ్యూసన్ మీద కాల్పులు జరిపారు. కానీ, తూటాలు ఆయనకు తగల్లేదు" అని ఆమె చెప్పారు.
- సిపాయిల తిరుగుబాటు: పబ్లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన తండ్రీకూతుళ్లు
తర్వాత మంగళ్ పాండే కత్తి కదిలింది
"అడ్జుటెంట్ లెఫ్టినెంట్ (లెఫ్టినెంట్కు సహాయంగా ఉండే అధికారి) బాంప్డే బాగ్కు దీని గురించి తెలీగానే ఆయన తన గుర్రంపై అక్కడకు చేరుకున్నారు. పాండే తన తుపాకీని లోడ్ చేస్తుండడం ఆయన చూశారు. మంగళ్ పాండే ఈసారి ఆయనపై కాల్పులు జరిపారు. మళ్లీ గురి తప్పింది. బాగ్ కూడా తన పిస్తోల్ తీసి పాండే మీద కాల్పులు జరిపారు. కానీ అవి కూడా పాండేకు తగల్లేదు" అని చరిత్రకారులు రోజీ లిల్వెలన్ జోన్స్ రాశారు.
చరిత్రకారుడు కిమ్ ఎ వాగనర్ ఆ తర్వాత ఏం జరిగిందో వివరంగా రాశారు.
"సార్జంట్ మేజర్ హ్యూసన్ 'మంగళ్ పాండేను పట్టుకో'మని ఈశ్వరీ ప్రసాద్కు చెప్పగానే, ఆయన హ్యూసన్తో 'నేనేం చేయగలను, మా నాయక్ అడ్జుటెంట్ దగ్గరకు వెళ్లాడు. హవల్దార్ ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లారు. నేనొక్కడినే తనను ఒంటరిగా అదుపు చేయగలనా' అన్నారు.
- దారా షికోహ్: సోదరుడి తల నరికి షాజహాన్కు బహుమతిగా పంపిన ఔరంగజేబ్
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
జోన్స్ కూడా తన పుస్తకంలో ఆ ఘటన గురించి చెప్పారు.
"మంగళ్ పాండే తన కత్తి తీసుకుని సార్జంట్ మేజర్, అడ్జుటెంట్ మీద దాడికి దిగారు. ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో షేఖ్ పల్టూ అనే ఒకే ఒక్క భారత అధికారి అక్కడ ఆ బ్రిటన్ సైనికాధికారులను కాపాడాలని ప్రయత్నించారు. పాండేతో దాడి చేయద్దని చెప్పారు. కానీ, మంగళ్ పాండే పల్టూ మీద కూడా దాడి చేశారు"
"తర్వాత మంగళ్ పాండేను పట్టుకోవడానికి నలుగురు సైనికులను పంపించాలని పల్టూ.. జమాదార్ ఈశ్వరీ ప్రసాద్కు చెప్పినపుడు, ఆయన పల్టూ పైకి తుపాకీ ఎక్కుపెట్టి.. మంగళ్ పాండేను పారిపోనివ్వకపోతే, కాల్పులు జరుపుతానని బెదిరించారు. నేను గాయపడి ఉండడంతో నేను పాండేను వదిలేశానని పల్టూ తర్వాత చెప్పారు" అని ఆమె తన పుస్తకంలో రాశారు.
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
చివరి తూటాను కాలి వేలితో పేల్చిన మంగళ్ పాండే
ఆ తర్వాత మంగళ్ పాండే తన సహచరులందరినీ గట్టిగా తిడుతూ, "మీరంతా కలిసి నన్ను రెచ్చగొట్టి, ఇప్పుడు నాకు సాయంగా రారేంటి" అని అరిచారు.
"అశ్వికదళం, పదాతిదళంలోని సైనికులు మంగళ్ పాండే వైపు వెళ్లడం మొదలెట్టారు. అది చూడగానే మంగళ్ పాండే చేతిలోని తుపాకీ బారెల్ను తన గుండెకు పెట్టుకున్నారు. కాలి బొటనవేలితో ట్రిగ్గర్ నొక్కారు. ఆ తూటా పేలడంతో ఆయన జాకెట్, బట్టలకు మంటలు అంటుకున్నాయి. గాయపడిన ఆయన నేలమీద పడిపోయారు" అని జోన్స్ తన పుస్తకంలో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ మడావి హిడ్మా... మావోయిస్టు పార్టీలో అంత త్వరగా ఎలా ఎదిగారు?
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై మావోయిస్టుల లేఖ... అందులో ఏముందంటే..
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- 'ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: జవాన్లపై దాడిని హైదరాబాద్ పోలీసులు ముందే ఊహించారా
- 'ఆయన నా గదిలోకి వచ్చి నాపై అత్యాచారం చేశారు... నేను మూడు రోజుల వరకు గదిలోనే ఉండిపోయాను’
- 'అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: ఆ రోజు అసలు ఏం జరిగిందంటే.. దాడిలో గాయపడిన CRPF జవాన్ చెప్పిన వివరాలు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)