మణిపూర్లో రికార్డు స్థాయిలో తొలివిడత పోలింగ్.. పలు చోట్ల హింసాత్మక ఘటనలు
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పోలీసు సిబ్బంది ఒకరు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పోలింగ్కు కొంత ఆటంకం ఏర్పడింది.
తొలి విడత 38 స్థానాల్లో పోలింగ్
అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను తొలివిడత 38 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. మొత్తం ఐదు జిల్లాలో 1,721 పోలింగ్ సేష్టన్లలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు 78.03 శాతం ఓటింగ్ నమోదైంది. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఓటింగ్కు కొంత ఆటంకం కలిగింది.

అనుమానాస్పద రీతిలో పోలీస్ మృతి
అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్న మణిపూర్ పోలీసు సిబ్బంది ఒకరు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. అయితే తన సర్వీస్ రైఫిల్ వల్ల ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల్లో మరణించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఈ ఘటన చురచంద్ పూర్ జిల్లా తిపైముఖ్ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుందని వెల్లడించారు. అటు పలుచోట్ల రెండు పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈవీఎం ఒకటి ధ్వంసమైంది.

బరిలో ప్రముఖులు
తొలివిడత జరుగుతున్న 38 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 12,09,439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి విడత బరిలో ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్, స్పీకర్ వై ఖేమ్ చంద్ సింగ్, డిప్యూటీ సీఎం యుమ్నాన్ జోయ్ కుమార్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ లోకేశ్ సింగ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications