అసెంబ్లీ ఎన్నికలు: మళ్లీ హింస, షర్మిళ ప్రభావం ఎంత?
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్సి)తోపాటు ఇతర వేర్పాటువాద సంస్థల ఆందోళనతో పరిస్థితి హింసాత్మకంగా మారుతోంది.
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్సి)తోపాటు ఇతర వేర్పాటువాద సంస్థల ఆందోళనతో పరిస్థితి హింసాత్మకంగా మారుతోంది. రాష్ట్రంలోని సామాజిక నేపథ్యం కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నది.
ఈశాన్య రాష్ట్రాల్లోని మణిపూర్లో భారతీయ రాజకీయ నాయకులు తప్పనిసరిగా అమలుచేయాల్సిన విధానాలు, పథకాల జాబితాలు, పరిష్కరించాల్సిన అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో ప్రధానమైన అంశం సుపరిపాలన, ప్రజల సంక్షేమంపై ఫోకస్ పెట్టడం ద్వారా భారత జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిన అంశాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా భారత జాతితో మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాన్ని అనుసంధానంచేసే ఆర్థిక విధానాలు అమలుచేయాల్సింది కూడా చాలా ఉన్నది.
గత మూడు నెలలుగా జాతుల పరమైన విభేదాల కారణంగా నాగా తీవ్రవాదులు జాతీయ రహదారులను దిగ్బంధంచేస్తే, మీటీలు ప్రతిగా దిగ్బందాలు కొనసాగిస్తుండటంతో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పనలవి కాదు. ఈ ఆందోళనల మధ్య రాష్ట్రం అనునిత్యం ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్నది. దీనికి తోడు సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం, ప్రాంతీయ సమగ్రత వంటి అంశాలు ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి.
మణిపూర్లో నెలకొన్న ఈ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనేందుకు కేంద్రం గణనీయ స్థాయిలో పారామిలిటరీ బలగాలను ఇంఫాల్ పట్టణంతోపాటు రాష్ట్రమంతా మోహరించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య 60 స్థానాల అసెంబ్లీకి మార్చి 4, 8 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడానికి పరిమితం కాకుండా రెండు జాతుల మధ్య సమస్య పరిష్కారంపై ద్రుష్టి సారించాలని మణిపూర్ వాసులు కోరుతున్నారు.
సర్కార్ ఆశలు దానిపైనే...
వరుసగా 15 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇబోబిసింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షోభానికి తెర దించేందుకు ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది. మైదాన ప్రాంతాల్లో మీటీలు, కొండ ప్రాంతాల్లో నాగాల ఆధిపత్యం కొనసాగుతున్నది. ఈ రెండు ప్రాంతాల మధ్య స్పష్టంగా విభజన రేఖ కనిపిస్తుంది. మీఠీల్లో అత్యధికులు వైష్ణవులు. ఇటువంటి పరిస్థితుల్లో గత డిసెంబర్ 8వ తేదీన ఇబోబిసింగ్ ప్రభుత్వం ఐదు కొండ ప్రాంత జిల్లాలు సేనాపతి, తమెంగ్ లాంగ్, చుర్ చాంద్ పూర్, చందేల్, ఉఖ్రుల్ లను విడగొట్టి కొత్తగా ఏడు జిల్లాలు ఏర్పాటుచేసింది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగాల ఓటుబ్యాంకు శక్తిని బలహీన పరిచేందుకే ఇబోబిసింగ్ ప్రభుత్వం జిల్లాలను విభజించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం ఈ నిర్ణయమే తమను తిరిగి ఎన్నికల్లో గెలిపిస్తుందని విశ్వసిస్తున్నది.
మళ్లీ ఆ నినాదం ముందుకు...
తమకు పట్టుకున్న ఉన్న ప్రాంతాలను కొత్తగా కాంగ్ పోక్సి, తెంగ్ నౌపాల్, పెర్జ్వాల్, నౌనే, జిరిబాం, కాంజొంగ్, కక్ చింగ్ జిల్లాలను ఏర్పాటు చేశారని నాగా తీవ్రవాదులు మండిపడుతున్నారు. ప్రభుత్వ వ్యూహాన్ని అర్థం చేసుకున్న నాగా తీవ్రవాదులు మళ్లీ ‘నాగాలిం', ‘గ్రేటర్ నాగాలాండ్' నినాదానికి ఊతమిచ్చారు. మణిపూర్ రాష్ట్రంతోపాటు అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లోని నాగాలు అత్యధికంగా జీవిస్తున్న కొండ ప్రాంతాలతో కలిపి గ్రేటర్ నాగాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకున్నది. ఈ ఆందోళనకు యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్సి) సారథ్యం వహిస్తున్నది. మరోవైపు నేషనలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఇసాక్ - మువియా) కూడా ఈ ఆందోళనకు మద్దతునిస్తున్నది.
ప్రజల ఇబ్బందులు ఇలా...
ప్రస్తుతం యుఎన్ సి అమలుచేస్తున్నదిగ్బందం వల్ల రాష్ట్ర ప్రజలు నిత్యావసరాలు అందుబాటులో లేక పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆహారం, ఇంధనం, ఔషధాలు, గ్యాస్ తదితర వస్తువులు అందుబాటులో లేక ఇక్కట్లనెదుర్కొంటున్నారు. కానీ ఈ తీవ్రవాద సంస్థలు మాత్రం రాజకీయ లక్ష్యాలకు చేరుకోలేకపోతున్నాయి. మరోవైపు న్యూఢిల్లీ నుంచి కేంద్రం సునిశితంగా పరిస్థితిని గమనిస్తున్నది. గత ఏడాది ఎన్ఎస్ సిఎన్ (ఐఎం)తో ఒప్పందం కుదుర్చుకున్నా.. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తేవడానికి పలు సవాళ్లను ఎదుర్కొంటున్నది. దీనికి రాజకీయ పరిష్కారం కనుగొనే అవకాశాలనూ పరిశీలిస్తున్నది. కానీ కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం కేంద్రం చేతులు ఎత్తేసిందని ఆరోపిస్తున్నారు. ఇబోబిసింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య పరిష్కారంలో చతికిల పడినా పట్టనట్లు వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ నాగాలు, మీటీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో సమతుల్యత సాధనకు ఆయా సంస్థల వ్యూహాలు ఏమిటన్న అంశంపైన సర్కార్ ద్రుష్టి పెట్టిందన్న మాట వాస్తవమే.
కాంగ్రెసుపై ప్రజా వ్యతిరేకత...
మూడుసార్లు అధికారం చేపట్టిన తర్వాత నాలుగో దఫా విజయం కోసం ప్రయత్నిస్తున్న ఇబోబిసింగ్ ప్రభుత్వం పట్ల ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉన్నది. పార్టీలో ప్రత్యర్థులే లేరు. కానీ ఎన్నికల షెడ్యూల్ మొదలైన తర్వాత కొద్ది మంది సీనియర్లు పార్టీని వీడటం ఇబ్బందికరమే. ప్రత్యేకించి ఇటీవలి వరకు సిఎం ఇబోబిసింగ్ కు కుడిభుజంగా ఉన్న బీరెన్ సింగ్ ప్రస్తుతం బిజెపి నుంచి ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. స్వయంగా నాగా అయిన ఇబోబిసింగ్ ఈ సమస్య పరిష్కరించడానికి సతమతమవుతున్నారు. తాజా ఆందోళనల నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అధికారం కోసం నాగా తీవ్రవాదులతో బిజెపి చేతులు కలిపిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. వరుస విజయాలతో ముందుకు సాగిన కాంగ్రెస్ పార్టీ నాలుగోసారి గెలుపొందాలంటే నాగాల ఆందోళనకు చరమగీతం పాడాలని, బయటి వ్యక్తులకు లక్ష్మణ రేఖ విధించాల్సిందేనని మీటీలు పట్టుబడుతున్నారు.
సయోధ్యకు బిజెపి యత్నం
అసోంలో గత ఏడాది విజయం తర్వాత మణిపూర్ ఎన్నికలపై ద్రుష్టిని కేంద్రీకరించింది. గత జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 278 మున్సిపల్ కౌన్సిళ్లలో 62 మంది కౌన్సిలర్లను, ఇంఫాల్ నగర పాలక సంస్థలో 10 మంది కార్పొరేటర్లను గెలుచుకున్నది. మాజీ కాంగ్రెస్, మాజీ త్రుణమూల్ కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుని అసెంబ్లీలో తన బలం పెంపునకు కసరత్తు చేస్తోంది. ఒకవైపు నాగా తీవ్రవాదులతో కలిసి పనిచేస్తూనే మరోవైపు మీటీలను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలోని వివిధ సంఘాలు, గ్రూపులతో సయోధ్య కుదుర్చుకుని రాష్ట్రంలో పాగా వేయాలని ఎత్తులు వేస్తోంది. తదనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక వ్యూహాలకు పదును పెడుతున్నది. కానీ ఇబోబిసింగ్ ను ఎదుర్కొనే సత్తా గల నాయకుడు బిజెపిలో లేకపోవడం ఇబ్బందికర పరిణామమే.
షర్మిల ప్రభావం తక్కువే..
సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అమలును వ్యతిరేకిస్తూ 16 ఏళ్ల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ఆధ్వర్యంలోని పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ ఎన్నికల బరిలో నిలిచినా ప్రభావం అంతంతే. తన సొంత నియోజకవర్గం థౌబల్ తోపాటు ఇబోబిసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖురాయ్ లోనూ పోటీకి ఆమె సిద్ధమవుతున్నారు. కానీ ఆమె పార్టీ నుంచి ప్రతిఘటన స్వల్పమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.