మన్మోహాన్కు జపాన్ అవార్డు వెనుక మోడీ హస్తం?
న్యూఢిల్లీ: జపాన్ దేశపు జాతీయ అత్యున్నత పురస్కారానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ఎంపికయ్యారు. గత 35 సంవత్సరాలుగా ఇరుదేశాల మధ్య సంబంధాలు, మైత్రీ బంధం పటిష్టతకు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను "ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలొనియా ప్లవర్స్" పురస్కారానికి ఎంపిక చేసినట్టు న్యూఢిల్లీలోని జపాన్ రాయబార కార్యాలయం తెలిపింది.
జపాన్ జాతీయ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయడుగా మన్మోహాన్ సింగ్ రికార్డు సాధించాడు. ఈ అవార్డుపై మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ మాట్లాడుతూ "జపాన్ ప్రజలు మరియు ప్రభుత్వం నా మీద చూపిన ప్రేమకు సర్వదా కృతజ్ఞుణ్ణి" అని అన్నారు.
"ఆసియాలో జపాన్, ఇండియా ముందు చూపుతో సాగుతున్నాయి. గత పది సంవత్సరాలుగా ఇరు దేశాలు కూడా విలువలు, భాగస్వామ్యం అభిరుచులు పంచుకున్నాయి" అని పేర్కొన్నారు. "భవిష్యత్తులో జపాన్, ఇండియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడటంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకుంటాయని విశ్వసిస్తున్నాను" అని అన్నారు. 2014కు గాను ఈ అవార్డును అందుకుంటున్న వారిలో మన్మోహాన్తో పాటు మరో 56 మంది విదేశీయులున్నారు.
కాగా ‘ద గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోనియా ఫ్లవర్స్' అవార్డుకు ఎంపికైన మన్మోహన్ సింగ్ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంశల వర్షం కురిపించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘జపాన్ ప్రభుత్వం ద్వారా ఒక రాజనీతిజ్ఞునికి అరుదైన అవార్డు దక్కి తగిన గుర్తింపు లభించింది. ఈ అవార్డు పొందిన డాక్టర్ సింగ్ మాతో పాటు జాతి మొత్తం గర్వపడేలా చేశారు' అని కొనియాడారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కుడా మన్మోహాన్కు అభినందనలు తెలిపారు.
ఐతే మన్మోహాన్ సింగ్కు ఈ అవార్డు రావడం వెనుక ఇప్పటి ప్రధాని నరేంద్రమోడీ పాత్ర ఉందనడంలో అతిశయోక్తి కాదు. ఇటీవలే ప్రధాని మోడీ జపాన్ టూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. జపాన్ టూర్లో ప్రధాని మోడీని డ్రమ్స్ వాయించి అక్కడి ప్రజలను తన్మయత్నానికి గురి చేసిన సంగతి కూడా తెలిసిందే.
జపాన్ ప్రతినిధులతో ప్రధాని నరేంద్రమోడీ పలు సందర్భాల్లో మీటింగ్లలో పాల్గొన్నప్పుడు జపాన్, ఇండియా ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడడానికి కృషి చేసిన మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ను ఈ అవార్డుకు ప్రతిపాదించాడని పీఎమ్ఓ ఆఫీసులో ఓ సీనియర్ అధికారి వన్ఇండియాకు తెలియజేశారు.
ప్రధాని మోడీ అభ్యర్ధనను మన్నించి మన్మోహాన్ సింగ్కు జపాన్ ఆత్యున్నత పురస్కారమైన "ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలొనియా ప్లవర్స్" పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిసింది. జపాన్ అత్యున్నత పురస్కారానికి ఎంపికైన మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్కు కాంగ్రెస్ పార్టీ మంగళవారం అభినందలు తెలిపింది. దీంతో పాటు ప్రధాని మోడీపై విమర్శలు చేసింది.
ఏఐసీసీ మీడియా విభాగం అధ్యక్షుడు అజయ్ మాకెన్ ట్విట్టర్లో "జపాన్ అత్యున్నత పరుస్కారం అందుకుంటున్న తొలి భారతీయుడైన మన్మోహాన్కు అభినందనలు" అంటూ పోస్ట్ చేశారు. మాజీ ప్రధానికి లభించిన ఈ అరుదైన పురస్కారాన్ని మీడియా గుర్తించలేదని ఆయన ఆరోపించారు.
"మన్మోహాన్ అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా అసలు గుర్తించ లేదు. మీడియా దేశం కోసం పనిచేస్తుందా లేక బీజేపీ కోసం పని చేస్తుందా? అని జాతి యావత్తూ తెలుసుకోవాలనుకొంటోంది" అని మరో ట్వీట్ చేశారు.