హ్యాక్ చేయలేరు: ప్రధానికి నో మొబైల్, ఈ-మెయిల్
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్కు సొంత మొబైల్ ఫోన్ గానీ, ఈ మెయిల్ ఖాతా గానీ లేదని, అలాంటప్పుడు అమెరికా వర్గాలు హ్యాక్ చేసే అవకాశమే లేదని ప్రధాని కార్యాలయం శుక్రవారం పేర్కొంది. ప్రపంచంలోని 35 దేశాల నాయకుల టెలిఫోన్ సంభాషణలను వైట్ హౌజ్, పెంటగాన్, అమెరికా అభివృద్ధి అధికారులు వింటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని కార్యాలయం ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
అమెరికన్ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన క్లాసిఫైడ్ పత్రాల ద్వారా అమెరికా వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మోర్కెల్ సంభాషణలను విన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ప్రధాని అధికార ప్రతినిధి సమాధానమిస్తూ.. ప్రధానికి సొంత మొబైల్ ఫోన్ గానీ, ఈ మెయిల్ ఖాతా గానీ లేదని తెలిపారు.
ప్రధాని కార్యాలయమే ఈ మెయిల్ను ఉపయోగిస్తోందని, వ్యక్తిగతంగా ప్రధానికి ఈ మెయిల్ లేదని, తమకు సమాచారం వింటారన్న, దొంగలిస్తారన్న ఆందోళన లేదని ఆయన పేర్కొన్నారు.