సెకండ్ వేవ్ వార్- మన్మోహన్ లేఖపై హర్షవర్దన్ ఫైర్-కాంగ్రెస్ ప్రభుత్వాలే టార్గెట్గా
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కూడా కారణమవుతోంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకునే హక్కు ఇవ్వాలంటూ నిన్న ప్రధాని మోడీకి మాజీ ప్రధాని మన్మోహన్ లేఖ రాశారు. దీనిపై ఇవాళ స్పందించిన ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ రాసిన లేఖపై స్పందించిన ఆరోగ్యమంత్రి హర్షవర్దన్.... ఆయనకు వ్యాక్సినేషన్పై పరిజ్ఞానం బాగానే ఉందని, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే కరోనా సెకండ్ వేవ్ కేసుల్లో ఎక్కువగా ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కరోనాపై సలహాలు ఇవ్వడం మాని నెగెటివ్ ప్రచారం చేస్తోందని హర్షవర్దన్ మండిపడ్డారు. కఠిన పరిస్ధితుల్లో రెండు వ్యాక్సిన్లు అందించిన భారత శాస్త్రవేత్తలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కూడా ధన్యవాదాలు చెప్పలేదని ఆయన ఆక్షేపించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనల వల్ల అక్కడ సీనియర్ సిటిజన్లతో పాటు ఫ్రంట్ లైన్ వర్కర్లకు కూడా జాతీయ సగటు కంటే తక్కువగా వ్యాక్సిన్లు అందుతున్నాయని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఆరోపించారు. దీంతో ఆయా రాష్ట్రాలు కరోనా ఎక్కువగా కేసులు వస్తున్న రాష్ట్రాల్లో ముందున్నాయన్నారు.
ఆయా రాష్టాల్లో పాజిటివ్ కేసుల నిష్పత్తి కూడా ఎక్కువగా ఉందన్నారు. మన్మోహన్ను ఉద్దేశించి మాట్లాడుతూ మీ విజ్ఞానం వారికి అందించాలని హర్షవర్ధన్ కోరారు. అంతే కాదు మీరు పంపిన లేఖలో పొందుపరిచిన సమాచారం మీకు అందించిన వారు తప్పుదోవ పట్టించారని కూడా హర్షవర్ధన్ ఆరోపించారు.