ఎగ్జిట్ పోల్స్ హవా: దలాల్ స్ట్రీట్‌లో జోష్, భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నిన్నటి ఎగ్జిట్ పోల్స్‌లో గుజరాత్‌‌లో బీజేపీకి ఎదురు లేదన్న సంకేతాలు వెలువడడంతో దలాల్‌స్ట్రీట్‌లో ఉత్సాహం ​నెలకొంది.

ఆరంభంలో 358 పాయింట్ల లాభాలను నమోదు చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 303 పాయింట్లు ఎగిసి 33,549 వద్ద, నిఫ్టీ సైతం 98 పాయింట్లు పుంజుకుని 10,350 వద్ద కొనసాగుతున్నాయి.

 దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే...

దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే...

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపాకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడంతో శుక్రవారం స్టాక్‌మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. గుజరాత్‌లో భాజపా 100 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి. దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే ఉన్నాయి. ముఖ‍్యంగా మెటల్‌, రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో సెక్టార్‌లో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. అదానీ పోర్ట్స్‌, వేదాంతా, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, హిందాల్కో, గెయిల్‌, టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌ లాభాల్లో ఉండగా, అంబుజా, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు స్వల్పంగా నష్టాలు చూస్తున్నాయి.

రెండు రోజుల నష్టాలకు బ్రేక్...

రెండు రోజుల నష్టాలకు బ్రేక్...

గురువారం నాటి ట్రేడింగ్‌లో గురువారం రోజంతా లాభనష్టాల మధ్య కదలాడిన స్టాక్ మార్కెట్.. చివరి గంటలో జరిగిన కొనుగోళ్లతో లాభాల్లోకి దూసుకుపోయింది. దీంతో గత రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌పడింది. గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 194 పాయింట్ల లాభంతో 33,247 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 10,252 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లలో బాగా కొనుగోళ్లు జరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించనున్నట్లు గురువారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే మార్కెట్‌ చివరి గంటలో లాభపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పెరిగిన టోకు ద్రవ్యోల్బణం....

పెరిగిన టోకు ద్రవ్యోల్బణం....

భారత ఆర్థిక వృద్ధి రానున్న రెండు క్వార్టర్లలో మెరుగుపడుతుందని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ తాజా నివేదిక వెల్లడించడం సానుకూల ప్రభావం చూపించింది. భారత ఆర్థిక వృద్ధికి సంబంధించి అధ్వాన పరిస్థితులు దాదాపు ముగిసేనట్లేనని ఈ సంస్థ పేర్కొంది. అయితే టోకు ధరల ద్రవ్యోల్బణం 3.93 శాతానికి పెరగడంతో ఇన్వెస్టర్లలో అప్రమత్తత నెలకొన్నది. మరోవైపు అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ పెంపు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, డాలర్‌తో రూపాయి మారకం బలపడడం స్టాక్‌ మార్కెట్‌కు జోష్‌నిచ్చింది.

 పుంజుకున్న పసిడి, 38 వేలకు వెండి...

పుంజుకున్న పసిడి, 38 వేలకు వెండి...

పసిడి ధర క్షీణతకు కూడా బ్రేక్ పడింది. వరుసగా పది రోజుల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం ఒక్కసారిగా పెరిగింది. రూ.230 పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.29,665కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో పసిడి ధర పెరిగినట్లు బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు వెల్లడించాయి. గత వారం బంగారు ఆభరణాల కొనుగోళ్లు భారీగా తగ్గడంతో 12రోజుల్లో రూ.1,551 వరకు తగ్గింది. మరోవైపు వెండి ధర పెరిగి.. రూ.38వేల మార్కుకు చేరుకుంది. రూ.680 పెరగడంతో కిలో వెండి ధర రూ.38,280గా ఉంది. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం, డాలర్‌ విలువ మారకపోవడం బంగారం ధర పెరుగుదలకు కలిసొచ్చిందని ట్రేడర్లు తెలిపారు.

నేటి మార్కెట్ ఎలా ఉండొచ్చంటే...

నేటి మార్కెట్ ఎలా ఉండొచ్చంటే...

గుజరాత్‌ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు శుక్రవారం స్టాక్ మార్కెట్ సూచీలకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. గుజరాత్‌లో భాజపా 100 కంటే తక్కువ సీట్లు గెలిస్తే మాత్రం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ శాతం ఎగ్జిట్‌ పోల్స్‌ గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో భాజపా విజయం సాధించొచ్చని అంచనా వేశాయి. అయితే మెజారిటీ తగ్గితే మాత్రం ప్రతికూల సంకేతాలు ఎదురవవచ్చని, ఆ ప్రభావం మదుపర్లపై పడవచ్చని విశ్లేషిస్తున్నారు. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. నేడు నిఫ్టీ 10175 - 10325 పాయింట్ల శ్రేణిలో కదలాడొచ్చని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంకింగ్‌ షేర్లలో మదుపర్లు షార్ట్‌ పొజిషన్లను కవర్‌ చేస్తుండటంతో.. ఈ షేర్ల జోరు కొనసాగే అవకాశం ఉంది.

 అప్రమత్తమైన సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు...

అప్రమత్తమైన సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు...

గుజరాత్‌లో భాజపాకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్స్‌ పోల్స్‌‌లో వెల్లడికావడంతో సెబీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు అప్రమత్తమయ్యాయి. స్టాక్‌ మార్కెట్లలో అవకతవకలకు, ఊగిసలాటలకు అవకాశం ఉండొచ్చనే అంచనాల మధ్య ఇవి కొద్ది రోజుల పాటు ట్రేడింగ్‌పై సునిశిత దృష్టిని సారించనున్నాయి. మరోవైపు సింగపూర్‌ ఎక్స్ఛేంజీల్లో నిఫ్టీ ఫ్యూచర్స్‌, ఆప్షన్లను కూడా గమనించనున్నారు. ఎందుకంటే భారత స్టాక్ మార్కెట్ల కంటే ఎంతో ముందుగా సింగపూర్ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభావం మన దేశీయ మార్కెట్లపై పడుతుంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను ప్రకటించేంత వరకు, అంటే.. డిసెంబరు 18 వరకు ఈ నిఘా కొనసాగొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అవకతవకలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే గుజరాత్‌లో ‘డబ్బా' ట్రేడింగ్‌ లేదా అనధికార ట్రేడింగ్‌ కార్యకలాపాలు చురుగ్గా నడుస్తున్నాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+