తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్, 20 వేల బలగాలతో!
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని భీమారంపాడు సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మతి చెందారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాతో పాటు దాదాపు 1000 మంది మావోయిస్టులు భీమారంపాడు సమీపంలోని కర్రగుట్టలో ఉన్నట్లు నిఘావర్గాలకు ఇటీవల సమాచారం అందింది.
ఈ క్రమంలో కర్రగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు రెండు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. అటవీ ప్రాంతం మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేయడంతో పాటు హెలికాప్టర్లతోనూ మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి.

భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కాగా, బీజాపూర్ జిల్లా ఊసురు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా మావోయిస్టు అగ్రనేతలు, పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమచారంతో కేంద్ర పారామిలటరీ బలగాలు ఆపరేషన్ చేపట్టాయి.
కర్రెగుట్టల్లో దాదాపు 1000 మందికిపైగా మావోయిస్టులు ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం ఉంది. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడకు చేరినట్లు తెలుస్తోంది. వీరిలో కమాండర్ స్థాయి నేతల నుంచి మావోయిస్టు అగ్రనేతల వరకు ఉన్నట్లు తెలిసింది. దీంతో భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భీమవరంపాడు, పూజారీ కాంకేర్, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది.
కూంబింగ్ నేపథ్యంలో కర్రెగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు. ఈ కూంబింగ్ ఆపరేషన్ నేపథ్యంలో భీమారంపాడు గ్రామస్తులు ఎవరూ కూడా బయటకు రావద్దని భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేశాయి.ఈ కూంబింగ్ ఆపరేషన్లో దాదాపు 20 వేల వరకు భద్రతా బలగాలు పాల్గొన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications