'నరేంద్రమోడీని అడ్డుకునేందుకు కాంగ్, కేజ్రీవాల్ ఫిక్సింగ్'
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవాను అడ్డుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెసు పార్టీ ఉపయోగించుకుంటోందని భారతీయ జనతా పార్టీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెసు కంటే తమకు ఎఎపి ప్రమాదకారి అని, బిజెపి అధికారంలోకి రాకుండా ఎఎపి, కాంగ్రెసులు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నాయని ఆందోళన చెందుతున్నారట.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కంటే కేజ్రీవాల్తో వచ్చే నష్టమే ఎక్కువని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుని తమ విమర్శలను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ మరింత స్పష్టమవుతోందంటూ బిజెపి అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఆరోపిస్తున్నారు. మోడీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ బి టీమ్ను రంగంలోకి తీసుకువచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీనే ఎఎపిని ప్రయోగించిందన్న వార్తలు సోషల్ నెట్వర్క్ సైట్లలో హల్చల్ చేస్తున్నాయి. అందుకే ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సహకరించిందని బిజెపి మద్దతుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో పీఠం దక్కించుకున్న ఎఎపి అన్ని హామీలను నెరవేరుస్తుందని తద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని వారు చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బరిలోకి దిగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎఎపి బరిలో ఉంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు గంపగుత్తగా బిజెపికి పడకుండా ఎఎపి కూడా కొంతమేర ఓట్లను చీలుస్తుందన్నది కాంగ్రెస్ ఆలోచనగా బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా బిజెపికి విద్యావంతులు, యువకులు మద్దతునిస్తారని, ఎఎపి బరిలో ఉంటే ఈ వర్గానికి చెందిన మెజారిటీ ఓట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంటుందంటున్నారు. దీంతో బిజెపికి గట్టి పోటీ ఇవ్వవచ్చని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బిజెపి భావిస్తోంది. ఎఎఫి వల్ల దాదాపు 30 నుంచి 50 సీట్లలో కాంగ్రెస్ లాభపడుతుందని, ఆమేరకు బిజెపికి నష్టం వాటిల్లుతుందంటున్నారు. అయితే, బిజెపి వాదనను ఎఎపి కొట్టి పారేస్తోంది.












Click it and Unblock the Notifications