దీదీ పతనం ప్రారంభం? కళ్లు బైర్లు కమ్మే అంచనాలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం క్లైమాక్స్కు చేరుకుంది. బుధవారం రాత్రి వెలువడిన మ్యాట్రైజ్ (Matrize) ఎగ్జిట్ పోల్ ఫలితాలు బెంగాల్ గడ్డపై రాజకీయ భూకంపం సృష్టిస్తున్నాయి. దశాబ్ద కాలానికి పైగా సాగుతున్న మమతా బెనర్జీ పాలనకు బ్రేక్ పడే అవకాశం ఉందని, కాషాయ జెండా బెంగాల్ కోటపై రెపరెపలాడనుందని ఈ సర్వే అంచనా వేస్తోంది.
మ్యాట్రైజ్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోరులో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 148 స్థానాల మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ అందుకునే అవకాశం మెండుగా ఉంది. ఈ సర్వే ప్రకారం బీజేపీ 146 నుండి 161 స్థానాలను కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది బీజేపీకి భారీ విజయమని చెప్పవచ్చు.

వెనుకబడ్డ తృణమూల్ కాంగ్రెస్..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ+ కూటమి ఈసారి గట్టి పోటీని ఇచ్చినప్పటికీ, అధికారాన్ని నిలబెట్టుకోవడంలో తడబడుతున్నట్లు కనిపిస్తోంది. మ్యాట్రైజ్ అంచనాల ప్రకారం టీఎంసీ కూటమి 125 నుండి 140 స్థానాలకే పరిమితం కానుంది. ఓట్ల శాతం పరంగా కూడా బీజేపీ 42.5% ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా, టీఎంసీ 40.8% ఓట్లతో స్వల్ప వెనుకబాటులో ఉంది. అంటే కేవలం 1.7% ఓట్ల తేడా బెంగాల్ భవిష్యత్తును మార్చబోతోంది.
నిర్ణయాత్మక శక్తిగా 'ఇతరులు'..
ప్రధాన పార్టీల మధ్య పోరు ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో, ఇతర పార్టీలు మరియు స్వతంత్రులు గెలుచుకోబోయే 6 నుండి 10 స్థానాలు అత్యంత కీలకం కానున్నాయి. ఇతర అభ్యర్థులు మొత్తం ఓట్లలో 16.7% వాటాను పొందే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఒకవేళ బీజేపీ 146 దగ్గరే ఆగితే, ఈ 'ఇతరులే' బెంగాల్ రాజకీయాల్లో కింగ్ మేకర్లుగా మారే అవకాశం ఉంది.
ఫలితాల ముఖచిత్రం (మ్యాట్రైజ్ అంచనా):
- మొత్తం స్థానాలు: 294 | మెజారిటీ మార్కు: 148
- బీజేపీ: 146 - 161 సీట్లు (42.5% ఓట్లు)
- టీఎంసీ+: 125 - 140 సీట్లు (40.8% ఓట్లు)
- ఇతరులు: 06 - 10 సీట్లు (16.7% ఓట్లు)














Click it and Unblock the Notifications