Matthew VanDyke: అమెరికా కిరాయి యుద్ధ వీరుడిని అరెస్టు చేసిన NIA-ఎవరితను..?
భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టిన ఒక మెరుపు దాడిలో.. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా ఒక అంతర్జాతీయ ముఠా పట్టుబడింది.అమెరికాకు చెందిన వివాదాస్పద యుద్ధ వీరుడు మాథ్యూ ఆరోన్ వాన్డైక్ సహా ఆరుగురు ఉక్రెయిన్ పౌరులను ఎన్ఐఏ అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఢిల్లీ, కోల్కతా,లక్నో విమానాశ్రయాల్లో ఏకకాలంలో ఈ ఆపరేషన్ జరిగింది.
భారత అంతర్గత భద్రతకు విఘాతం కలిగించేలా ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై ఒక అమెరికన్ మరియు ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 13న జరిగిన ఈ ఆపరేషన్లో కోల్కతాలో వాన్డైక్ దొరకగా, లక్నో, ఢిల్లీలలో ముగ్గురు చొప్పున ఉక్రెయిన్ పౌరులు పట్టుబడ్డారు.

ఎవరీ మాథ్యూ వాన్డైక్?
ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి మాథ్యూ వాన్డైక్. ఈయన కేవలం డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ మాత్రమే కాదు.. ఒక అంతర్జాతీయ 'మెర్సెనరీ' (డబ్బు కోసం యుద్ధాల్లో పాల్గొనే సైనికుడు).2011 లిబియా అంతర్యుద్ధంలో భాగంగా గడ్డాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు దళాల తరపున పోరాడి వార్తల్లో నిలిచారు.ఇరాక్లో ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, సిరియా తిరుగుబాటు దళాలకు కూడా సహకరించారు. 2022లో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ సైనికులకు, పౌరులకు అత్యాధునిక యుద్ధ తంత్రాలలో శిక్షణ ఇచ్చాడు.
NIA ఆరోపిస్తున్న కుట్ర ఏమిటి?
ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) ప్రకారం, ఈ ఏడుగురిపై అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి:
- అక్రమ ప్రవేశం: అనుమతి (Restricted Area Permit) లేకుండా మిజోరాం సరిహద్దుల గుండా మయన్మార్లోకి అక్రమంగా ప్రవేశించారు.
- మిలిటెంట్లకు శిక్షణ: ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు సంస్థలతో సంబంధం ఉన్న సాయుధ గ్రూపులకు వీరు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.
- డ్రోన్ వార్ఫేర్: ఐరోపా నుండి అత్యాధునిక డ్రోన్లను దిగుమతి చేసుకుని,మయన్మార్లోని శిక్షణ శిబిరాల్లో డ్రోన్ ఆపరేషన్స్,అసెంబ్లీ మరియు జమ్మింగ్ టెక్నాలజీపై ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం వీరి ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది.
UAPA కింద కేసు నమోదు
ఈ ఏడుగురిని మార్చి 16న ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం వారికి 11 రోజుల ఎన్ఐఏ కస్టడీ విధించింది. వీరిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం (UAPA) కింద కేసులు నమోదు చేశారు. విదేశీయులు భారత సరిహద్దు ప్రాంతాల్లోకి ప్రవేశించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను వీరు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని అధికారులు తెలిపారు.
అంతర్జాతీయ యుద్ధ క్షేత్రాల్లో ఆరితేరిన ఒక వ్యక్తి, ఉక్రెయిన్ నిపుణులతో కలిసి భారత సరిహద్దుల్లో సంచరించడం సామాన్యమైన విషయం కాదు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించే కుట్ర ఏదైనా ఉందా? అన్న కోణంలో ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది. విదేశీ శక్తులు మన అంతర్గత భద్రతతో ఆటలాడుకోవాలని చూస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ అరెస్టులు హెచ్చరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications