పొత్తుతో పోటు: ఆ పోటును బీజేపీ తట్టుకుంటుందా..?
రాజకీయంగా దేశంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజలే దేశ రాజకీయాలను నిర్ణయిస్తారు. ఎందుకంటే దేశంలోని అత్యధిక జనాభా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. అంతేకాదు యూపీలో పార్లమెంటు స్థానాలు కూడా ఎక్కువే. ఉత్తర ప్రదేశ్లో 80లోక్సభ స్థానాలున్నాయి. దీంతో ఈ రాష్ట్రానికి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తర్ప్రదేశ్లో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికల వరకు యూపీలోని ప్రధాన పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు శతృవులు మిత్రులయ్యారు. ఈ క్రమంలోనే ఓ సరికొత్త చరిత్రను సృష్టించేందుకు ఇటు అఖిలేష్ యాదవ్, అటు మాయావతి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఒకే తాటిపైకి అఖిలేష్-మాయావతి
ఉత్తర్ ప్రదేశ్లో రాజకీయ వేడి మొదలైంది. ఎండాకాలంకు ఇంకా సమయం ఉండగానే ఈ చలికాలం రాజకీయాలతో వేడెక్కుతోంది. బద్ధ శత్రువుల్లా ఉన్న అఖిలేష్ యాదవ్ మాయావతిలు ఒకటి కానున్నారు. శతృవుకు శతృవు మిత్రుడు అన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఇద్దరికి ఉమ్మడి శతృవు బీజేపీ నరేంద్ర మోడీ. ఈ బలమైన పార్టీని యూపీలో నామరూపాలు లేకుండా చేయాలనే యోచనతో ఇద్దరు ఒకే తాటిపైకి వచ్చి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎవరి స్కెచ్ వారు గీసుకుంటున్నారు.
యూపీఏ పాలనకు ముగింపు, బీజేపీ అధికారంలోకి వస్తుంది!: కాంగ్రెస్ ముఖ్యమంత్రి
ఎస్పీ బీఎస్పీ పొత్తుపై సంయుక్త ప్రకటన
ఇక అఖిలేష్ యాదవ్ మాయావతిలు శనివారం తమ పొత్తులపై ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు. రానున్న ఎన్నికల్లో ఇద్దరూ పొత్తుతో వెళ్లి కేంద్రంలో మోడీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. తద్వారా కేంద్రంలో కీలకంగా మారాలనే యోచనతో పావులు కదుపుతున్నారు. గతవారం అఖిలేష్ యాదవ్, మాయావతిలు ఢిల్లీలో కలిసి సీటు పంపకాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాదు ఒక సీటు షేరింగ్పై ఒక ఫైనలైజేషన్కు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
78స్థానాల్లో పోటీచేయనున్న ఎస్పీ-బీఎస్పీ
80 లోక్సభ స్థానాలున్న ఉత్తర్ప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, మాయావతి బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు 78 స్థానాల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ 78 స్థానాల్లో ఇద్దరు చెరో సగం అంటే 39 స్థానాల్లో ఎస్పీ మరో 39 స్థానాల్లో బీఎస్పీలు పోటీచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి పోటీలో అభ్యర్థులను నిలపకూడదని నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
యూపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు..?
ఇక కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఉత్తర్ ప్రదేశ్లో ఒంటరిగానే పోటీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ప్రజలు ఆదరించిన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్లో కూడా తమకు కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్కు మరో తలనొప్పి వచ్చిపడింది. ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్నట్లే...ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ను సైడ్ చేస్తారేమో అనే ఆందోళన హస్తం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్ర పక్షం అప్నాదల్ పార్టీలు ఉత్తర్ ప్రదేశ్లో 73 స్థానాలు గెలిచాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లు మోడీ మానియా ముందు తుడుచుపెట్టుకుపోయాయి.
మొత్తానికి శనివారం ఎస్పీ బీఎస్పీల ప్రకటన పై దేశంలోని రాజకీయ పార్టీలు ఆసక్తికరంగా చూస్తున్నాయి. ఎస్పీ బీఎస్పీల పొత్తు దేశరాజకీయాలను మరో ఎత్తుకు తీసుకెళుతాయని పొలటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.