అంబేద్కర్కు గౌరవం ఇవ్వలేదు: మాయవతి, రూ. 1000 కోట్లు ఇవ్వండి: అఖిలేశ్
లక్నో: భారతదేశంలో అతిపెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల వైఖరిపై బీఎస్పీ అధినేత మాయావతి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు డా. బీఆర్ అంబేద్కర్ను అవమానించాయని మండిపడ్డారు. అంబేద్కర్ 124వ జయంతిని పురస్కరించుకుని లక్నోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు ఎప్పుడూ అంబేద్కర్కు గౌరవం ఇవ్వలేదని, కేవలం ఆయన్ని ఎన్నికల మస్కట్గానే ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. దేశంలోని రాజకీయ పార్టీలు అంబేద్కర్ను అవమానంగానే భావించారన్న ఆమె, ఆయన జయంతిని నిర్వహించడాన్ని ఓ డ్రామాలాగా చేస్తుంటారని అన్నారు.
ఇక, రాష్ట్రంలోని సమాజ్వాది ప్రభుత్వంపై కూడా ఆమె నిప్పులు చెరిగారు. అంబేద్కర్కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వడం లేదన్నారు. అంబేద్కర్ వర్ధంతిని బీఎస్పీ ప్రభుత్వం అధికారంకంగా సెలవుదినంగా ప్రకటిస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సమాజ్వాది పార్టీ సెలవు దినాన్ని తీసేసిందన్నారు.
సమాజ్ వాది పార్టీకి చెందిన దళిత ఎమ్మేల్యేలు నిరసన చేయడంతో, అంబేద్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించారన్నారు. కేవలం రాజకీయ లభ్దికోసమే అంబేద్కర జయంతిని సెలవు దినంగా ప్రకటిందే తప్ప, భారత రాజ్యాంగం సృష్టికర్త అయిన అంబేద్కర్పై వారికి ఎలాంటి ప్రేమ లేదన్నారు.
అకాల వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం, రూ. వెయ్యి కోట్లు ఇవ్వండి: అఖిలేశ్
అకాల వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైందని, కేంద్రం తమకు రూ. 1000 కోట్లు సాయం అందించాలని ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ కోరారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఈ మొత్తాన్ని ఇవ్వాలని ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.
అకాల వర్షం కారణంగా జరిగిన పంట నష్టానికి సంబంధించిన లేఖను నివేదికతో పాటు జత చేసి మరీ పంపారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటంబాలకు సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు పరిహారంగా అందజేస్తామన్నారు.