మచ్చిక!: ఢిల్లీలో మాయావతికి 3 ఖరీదైన బంగ్లాలు
న్యూఢిల్లీ: బహుజన సమాజ్వాది పార్టీ (బిఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి దేశ రాజధాని న్యూఢిల్లీలో మూడు ఖరీదైన భవనాలను ఇచ్చారు. నాలుగు బెడ్ రూంలు కలిగిన టైప్ 8 ప్రభుత్వ బంగళాలను మాయావతి, ఆ పార్టీకి కేటాయించారు. పార్లమెంటు హౌస్ దగ్గర్లోని గురుద్వారా రకబ్ గంజ్ రోడ్డు సమీపంలో ఇవి ఉన్నాయి.
డాక్యుమెంట్స్ ప్రకారం ఇందులో మూడు బంగళాలను మాయావతి ఒక బంగ్లాగా మార్చి బహుజన ప్రేరణ ట్రస్ట్ పేరిట వీటిని మార్చారు. సుభాష్ అగర్వాల్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించగా ఈ విషయం బయటపడింది.
దీనిపై సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగం(సిపిడబ్ల్యూడి) దృష్టి సారించింది. ప్రభుత్వ భవనాలను కేటాయించే పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు, దాని కనుసన్నల్లో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్టేట్స్కు ఫిర్యాదు చేసింది. ఈ మూడు భవనాలు కాకుండా మాయావతికి ఇదే ప్రాంతంలో మరో బంగ్లా కూడా ఉంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్టేట్స్ ఈ అక్రమాన్ని ద్రువీకరించింది. కేంద్ర మంత్రులు, అత్యున్నతస్థాయి నేతలు, అధికారులు నివసించే ఈ ప్రాంతాన్ని లూటెన్ జోన్ అంటారు. నిబంధనల ప్రకారం ఇక్కడి ప్రభుత్వ భవనాల్లో ఎలాంటి మార్పులూ చేయకూడదు. కానీ మాయావతి మూడు బంగ్లాల్లోనూ అక్రమ నిర్మాణాలు జరిగాయని, దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని సిపిడబ్ల్యూడి అధికారి ఒకరు తెలిపారు.
2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాయావతిని ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్ సర్కారు ఆమెకు ఇలా ఢిల్లీలోని అత్యంత ఖరీదైన, ప్రధాన ప్రాంతంలో నాలుగు బంగ్లాలు కేటాయించిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.