యూపీ ఎన్నికలు: ‘మాయా’దే గెలుపా?

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు పావులు కదిపిందని, ఆ పార్టీలో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ వల్లే సర్దుబాట్లు ఆలస్యమయ్యాయని తెలుస్తున్నది.

లక్నో: అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించే దిశగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి ముందుకు సాగుతున్నారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొంటుందని భావిస్తూ యావత్ మీడియా ఫోకస్ అంతా యూపీ సీఎం - ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ మధ్య పొత్తుపై పెడితే ఆమె మాత్రం మూడో కంటికి తెలియకుండా క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళిని నిర్ణయించేశారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎస్పీతో పొత్తు యత్నాలకు ముందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాయావతితోనే కూటమి కట్టేందుకు తహతహలాడిందని తెలుస్తున్నది.

కానీ యూపీలో ఏమాత్రం ప్రభావితం చేయలేని పార్టీగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్ల తనకే నష్టమని, కనుక అవసరం లేదని ఆమె కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు పావులు కదిపిందని, ఆ పార్టీలో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ వల్లే సర్దుబాట్లు ఆలస్యమయ్యాయని తెలుస్తున్నది. అయితే బీజేపీని ఎదుర్కోగల సామర్థ్యం గల కూటమిగా ఎస్పీ - కాంగ్రెస్ పార్టీల పొత్తును పరిగణిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా బీఎస్పీ మాత్రమే బీజేపీని అడ్డుకోగలుగుతుందని అంచనావేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నందున ప్రజలు సమాజ్ వాదీ పార్టీ సారథ్యంలో గూండా రాజ్యానికి తిలోదకాలిస్తారని బీఎస్పీ శ్రేణులు అభిప్రాయ పడ్తున్నాయి. ఇవీ కారణాలు:

143 స్థానాల్లో ముస్లింలే కీలకం

రాష్ట్రంలోని 73 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 30 శాతానికి పైగా, మరో 70 శాసనసభా నియోజకవర్గాల పరిధిలో 20 నుంచి 30 శాతం లోపు ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ 143 నియోజకవర్గాల పరిధిలో ఇతర పార్టీల కంటే ముందుగానే మేల్కొన్న బిఎస్పీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నియోజకవర్గాల పరిధిలో విస్త్రతంగా పర్యటించిన మాయావతి.. రికార్డు స్థాయిలో 97 మంది ముస్లిం అభ్యర్థులను ప్రకటించింది. తర్వాతీ స్థానంలో 86 మంది దళితులను బరిలో నిలిపిన మాయావతి.. ముందస్తు ప్రచారంలో ప్రార్థనా సమయాల్లో తన ప్రసంగం నిలిపివేస్తూ ఆయా ప్రాంతాల మైనారిటీల మనస్సులు చూరగొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పొత్తు యత్నాలు విఫలం

తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందన్న పార్టీ నేతల సూచనలను సున్నితంగానే తిరస్కరించిన మాయావతి దానివల్ల తమ పార్టీకే నష్టం అని వివరణ ఇచ్చారు. 27 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తనకు విధేయులుగా ఉన్న జాతవ్ (దళితులు) ఓటర్లు హస్తం పార్టీవైపు మళ్లుతారని ఆమె అనుమానం. ఇదే విషయాన్ని తన వద్దకు పొత్తు కోసం రాయబారులుగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు మాయావతి స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. దీనికి తోడు గత లోక్ సభ ఎన్నికల్లో అతి చిన్న పార్టీ స్థాయికి కుంచించుకుపొయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు అవసరమే లేదని ఆమె తేల్చి చెప్పారని తెలుస్తున్నది. పది శాతం మద్దతు గల హస్తం పార్టీ మద్దతు తీసుకునే విషయమై తనకు ఆసక్తి లేదని మాయావతి అన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Mayawati, Ignored By Media, Is Way Ahead In Campaigning

ప్రజలతో మమేకం.. శాంతిభద్రతల పరిరక్షణ

'బెహెన్ జీకి విదేశీ ఫ్యాన్సీ, స్థానిక వ్యూహకర్తల అవసరం లేదు. మాకు మా ప్రజలెవరో తెలుసు. వారే మాకు అత్యంత పునాది. శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉంటే ఆర్థిక పరమైన అవకాశాలు అందరికీ సమానంగా లభిస్తాయి' అని బీఎస్పీ సీనియర్ నేత సతీశ్ మిశ్రా తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్, అఖిలేశ్ ప్రచార వ్యూహకర్తగా హార్వర్డ్ వర్సిటీ పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ స్టీవ్ జార్డింగ్ సలహాలు ఇస్తున్న సంగతి తెలిసిందే .

మీడియా ప్రచారంపై ఆచితూచి అడుగులు

మీడియాతో అనుబంధం పెంచుకునే విషయమై మాయావతి ఆచితూచి ముందుకెళ్తున్నారు. గతంలో మాదిరిగా వారిని మనువాదీలుగా పిలిచేందుకు ఇష్టపడటం లేదు. తన వార్తల ప్రసారానికి ఎక్కువగా సమయం ఇవ్వడం లేదని గతంలో ఆమె విమర్శించే వారు. అయితే తన ప్రసంగాలు జాగ్రత్తగా విన్న యూపీ ఓటరు, యాదవ్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడతారని మాయావతి ఆశిస్తున్నారు. ఎస్పీలో ఘర్షణ కేవలం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొలేక స్వయంగా పార్టీ వ్యవస్థాపకుడు మలాయింగ్ సింగ్ ఈ డ్రామాకు తెర తీశారని ఆమె భావిస్తున్నారు.

జాతవేతర దళితులంతా తనవైపేనని భావిస్తున్న బెహెన్

గత లోక్ సభ ఎన్నికల్లో మోడీ ప్రభంజనంలో ఆయన సారథ్యంలోని బిజెపి దళితుల ఓట్ల శాతం గెలుచుకున్నది. ఫలితంగా 80 పార్లమెంట్ స్థానాలకు 73 స్థానాలకు ఎగరేసుకుపోయిన కమలనాథులు ప్రస్తుత పరిస్థితులు ఒకింత తిరగబడ్డాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావ్రుతమవుతాయని బిజెపి నేతలు ఆందోళన చెందుతున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల తర్వాత బిజెపి కేవలం హర్యానా, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఇటీవల తోళ్ల శుద్ధి కంపెనీల్లో పనిచేస్తున్న దళితులు, బీఫ్ తినే వారిపై దాడిచేసిన ఘటనలు వారిని తప్పక ప్రభావితం చేస్తాయన్నారు.

ఉనా దాడి, రోహిత్ ఆత్మహత్యలతో బీజేపీపై దళితుల్లో వ్యతిరేకత

గత ఏడాది గుజరాత్ లోని ఉనాలో దళితులపై దాడి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత యూపీలో దళితులు రాజకీయంగా చైతన్య వంతులయ్యారని బీఎస్పీ వర్గాలు తెలిపాయి. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా దళితులకు పార్టీ టిక్కెట్లు కేటాయించినా ఆర్థిక పరమైన సాయం చేసేది మాత్రం సంప్రదాయంగా తొలి నుంచి పార్టీకి మద్దతుగా నిలిచిన అగ్రకులాల అభ్యర్థుల వైపేనని చెప్తున్నారు. మోదీ తన సభలకు హాజరైన వారిని వాడుకుని వదిలేయడమే ఆయన చేసే పని అని రాష్ట్ర వాసులు విశ్విస్తున్నారు. ప్రధాని మోదీకి మంచి రోజులు వచ్చాయే గానీ యూపీ సాధించిన అభివ్రుద్ధి ఏదని ప్రశ్నిస్తున్నారు. 'నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోదీపై విమర్శలు చేసి మీ దగ్గర నగదు లాగేసుకుంటున్నారని ఆమె అన్నప్పుడు సభికుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని పార్టీ నేతలు చెప్తున్నారు.

ప్రధాని మోదీపైనే ప్రత్యక్ష దాడి

మాయావతి ప్రధాని కావాలన్న తన ఆకాంక్షలను బయటపెట్టేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. ప్రత్యక్షంగానే ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరుగుతున్నారు. ఇక తనను గెలిపిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని కాపాడుతానని ఆమె అంటున్నారు. తాను ఎప్పటికప్పుడు లక్నోలో ఉంటూ పరిస్థితి చక్కదిద్దగలనన్నారు. కానీ ఢిల్లీలోనే సరిగ్గా ఉండని ప్రధాని మోదీ (ఎల్లవేళలా ప్రధాని విదేశీ పర్యటనల్లో ఉంటారు) కి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని చెప్తున్నారు.
గతంలో అహంభావి అన్న ముద్ర పడిన మాయావతి ఆ ధోరణి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరంతరం పార్టీ నేతలు, శ్రేణులతో మమేకం కావడానికి క్రుషిచేస్తున్నారు. మీడియా గుడ్డిగా వ్యవహరిస్తూ కేజ్రీవాల్, నితీశ్ కుమార్, అఖిలేశ్ యాదవ్ లను మోదీకి సరైన ప్రత్యర్థి అన్న ప్రచారం తెస్తున్నదే తప్ప ఒక మహిళగా మాయావతి అభ్యర్థిత్వానికి ప్రచారం కల్పించడం లేదన్న అపప్రదను మీడియా మోస్తున్నది. నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన మాయావతికి ఓటర్ల నిజమైన మన:స్తత్వమేమిటో తెలుసునని ఆ పార్టీ నేతలంటున్నారు.

అప్నా బెహన్ బహార్ కా పీఎం.. బీఎస్పీ నినాదం

ఒకవైపు ఉచిత హామీలు మరోవైపు ప్రధాని మోదీ ఆయన నోట్ల రద్దు నిర్ణయం పోటాపోటీ పడుతుంటూ మాయావతి మాత్రం 'అప్పా బెహెన్.. బాహర్ కా పీఎం (మన సోదరు, బయటి ప్రధాని) అనే నినాదంతో బీఎస్పీ శ్రేణులు ప్రచారంలోకి వెళుతున్నాయి. ఎస్పీ - కాంగ్రెస్ కూటమి కూడా మన కుర్రాళ్లు.. బయటి వ్యక్తి అనే నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నది. అన్నింటికన్నా గమ్మత్తేమిటంటే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడమే వ్యూహాత్మక పొరపాటు కావడం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొసమెరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+