రాజద్రోహం కేసులో మాజీ ఎంపీకి ఏడాది జైలు: రేపు నామినేషన్, ఎల్ టీటీఈకి ఏమైయ్యింది!
చెనై: తమిళనాడు సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) చీఫ్ వీ. గోపాలస్వామి అలియాస్ వైగోకు చెన్నైలోని ప్రత్యేక కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రాజ్యసభ సభ్యుడు వైగోకు ఒక ఏడాది జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా విదిస్తూ చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జే. శాంతి ఆదేశాలు జారీ చేశారు.
2008 నాటి రాజద్రోహం కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు వైగోకు జైలు శిక్ష పడింది. 2008 అక్టోబర్ 21వ తేదీ రాజా అన్నామలై మండ్రంలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన వైగో ఈలంకు ఏమైయ్యింది (ఎల్ టీటీఈకి ఏమైయ్యింది) అనే అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు.
ఆ సందర్బంలో ఎల్ టీటీఈకి మద్దతుగా మాట్లాడిన వైగో భారత్ ఒక్కటిగా కలిసి ఉండదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎల్ టీటీఈ నిషేదం గురించి మాట్లాడిన వైగో అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు పోలీసులు 2009 డిసెంబర్ 30వ తేదీ వైగో మీద రాజద్రోహం కేసు నమోదు చేశారు.
వైగో మీద కేసు నమోదు అయినా ఆయన్ను మాత్రం పోలీసులు అప్పట్లో అరెస్టు చెయ్యకపోవడంతో అనేక విమర్శలు ఎదురైనాయి. పాస్ పోర్టు అధికారులు సైతం వైకో పాస్ పోర్టును పరిశీలించారు. కేసు విచారణ ఎదుర్కొంటున్న వైకోను 2017లో అరెస్టు చెయ్యడంతో ఆయన దాదాపు నెల రోజులు జైల్లో ఉన్నారు.
2017లో చెన్నైలోని ప్రత్యేక కోర్టు వైగోకు జామీను మంజూరు చెయ్యడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. చెన్నైలోని ఎగ్మూరు ప్రత్యేక కోర్టు కేసు విచారణ చేసి శుక్రవారం వైగోకు ఏడాది జైలు శిక్ష విధించింది. 1990, 19996 రాజ్యసభ్యకు వెళ్లిన వైగో ఇప్పుడు మళ్లీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. అయితే వైగోకు చెందిన ఎండీఎంకే పార్టీకి ఒక్క ఎమ్మెల్యేకూడా లేరు.
శనివారం రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వెయ్యడానికి సిద్దం అయిన వైగోకు కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయితే పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి వైగోకు చెన్నై కోర్టు అవకాశం ఇచ్చింది. డీఎంకే పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో మరోసారి రాజ్యసభ సభ్యత్వానికి జరిగే ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి వైగో సిద్దం అయ్యారు. జులై 18వ తేదీన తమిళనాడులో రాజ్యసభ సభ్వత్వానికి ఎన్నికలు జరగనున్నాయి. న్యాయనిపుణలతో సంప్రధించిన తరువాత మా నాయకుడు సరైన నిర్ణయం తీసుకుంటారని ఎండీఎంకే నాయకులు అంటున్నారు.