ఈసీకి మళ్లీ షాక్ -హైకోర్టు తప్పులేదు -మీడియానూ నియంత్రిచలేం -‘ఈసీపై హత్య కేసు’వివాదంలో సుప్రీం క్లారిటీ
కరోనా విలయ కాలంలో ఎన్నికలు పెట్టడం ద్వారా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకులయ్యారని, ఇందుకుగానూ ఈసీపై హత్యకేసు పెట్టాలని మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దాదాపుగా సమర్థించింది. స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి హైకోర్టులు అనుచిత కామెంట్లు చేయడం, వాటిని మీడియా యథాతథంగా రిపోర్టు చేయడాన్ని సవాలుచేస్తూ, మీడియాపై ఆంక్షలు విధించాల్సిందిగా ఎన్నికల సంఘం చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది..
వివిధ స్థాయిల కోర్టుల్లో జరిగే విచారణ తీరుతెన్నులు, వాదోపవాదాలు, జడ్జిలు, లాయర్ల వ్యాఖ్యలను రిపోర్ట్ చేయకుండా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మీడియా చాలా శక్తిమంతమైందని, కోర్టుల్లో జరుగుతోన్న విషయాలను బయటకు తెలియజేస్తుందని, ప్రజలు కూడా కోర్టు వ్యవహారాలపై అంతే ఆసక్తిగా ఉంటారని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దేశంలో కొవిడ్-19 కేసుల పెరుగుదలకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని, వారిపై హత్యానేరం కింద విచారణ చేపట్టవచ్చని మద్రాస్ హైకోర్టు ఇటీవల చేసిన మౌఖిక వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(ఈసీ) వేసిన పిటిషన్ను విచారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పులే కాకుండా విచారణలో భాగంగా లేవనెత్తే ప్రశ్నలు, సమాధానాలు, వాదనలపై కూడా పౌరులకు పట్టింపు ఉంటుందని, కోర్టుకు సంబంధించి రిపోర్టులను మీడియా ప్రచురించకపోవడం అనేది ఆచరణకు చాలా దూరమైన అంశమని ధర్మాసనం తెలిపింది.
బీజేపీ గెలుపుతో జగన్ చేతికి అస్త్రం -అడకత్తెరలో కేంద్రం -ఏపీలో మళ్లీ హోదా ఉద్యమం? వైసీపీ గేమ్!
కొవిడ్ వ్యాప్తికి సంబంధించి సంబంధిత విపత్తు నిర్వహణ అధికారుల నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండానే, ఎన్నికల సంఘానికి కనీసం ఒక అవకాశం ఇవ్వకుండానే హైకోర్టులు ఇష్టారీతిగా నిందిస్తున్నాయని ఈసీ తరఫు న్యాయవాది వాపోగా, కోర్టులు, మీడియా, ఈసీలు మూడూ రాజ్యాంగ వ్యవస్థకు పునాదుల్లాంటివని, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కోర్టులు కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటాయని, ఈసీ సరైన దారిలో వెళ్లేందుకు అలాంటి వ్యాఖ్యలు ఉపకరిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
విచారణలో భాగంగా కొన్నిసార్లు న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారని, కోర్టును ఎలా నిర్వహించాలో ఈసీ చెప్పాల్సిన అవసరం లేదని, అసౌకర్యమైన ప్రశ్నలు సంధించే స్వేచ్ఛ హైకోర్టు న్యాయమూర్తులకు ఉంటుందంటూ సుప్రీంకోర్టు ఈసీకి చురకలు వేసింది. అయితే, మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు విచారణలో భాగంగా చేసినవి కాదని, పైగా వాటిని తుది ఆదేశాల్లోనూ చేర్చలేదని ఈసీ తరఫు న్యాయవాది చెప్పగా, జస్టి షా స్పందిస్తూ.. అన్నింటినీ ఆదేశాల్లో చేర్చలేమని.. అది సహజంగా జరిగే ప్రక్రియ అని వ్యాఖ్యానించారు.