దారుణం: ప్రసవ సమయంలో మహిళను తీవ్రంగా కొట్టిన వైద్యులు
లక్నో: ప్రసవ సమయంలో గర్భవతి అయిన మహిళను మేల్కొని ఉంచడానికి వైద్యులు ఆమెను కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో చోటు చేసుకుంది. దీంతో ప్రభుత్వం ఘటనపై విచారణకు ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. కైసర్బాగ్ ప్రాంతంలోని ఆస్పత్రిలో ఓ మహిళకు ప్రసవం చేస్తూ వైద్యులు ఆమెను మేల్కొనే ఉంచడానికి చెంపలపై గట్టిగా కొట్టారు. దీంతో ఆమె చెంపలు ఎర్రగా కందిపోయి ఉబ్బిపోయాయి. ఆ తర్వాత మహిళను చూసిన కుటుంబసభ్యులు వైద్యులపై ఆగ్రహానికి గురయ్యారు.
అంత తీవ్రంగా కొట్టడాన్ని తప్పుపడుతూ ప్రసవం చేసిన వైద్యులపై మహిళ కుటుంబసభ్యులు చీఫ్ మెడికల్ అధికారికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఆరోగ్య శాఖ యంత్రాంగం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ఆమె ముఖం బాగా ఉబ్బిందని, ఎర్రగా కందిపోవడంతో కనీసం మాట్లాడలేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుపై స్పందించిన ఆరోగ్య శాఖ అధికారులు,2 వారాల్లోగా ఘటనపై నివేదిక అందించాలని ఆదేశించారు.