బీజేపీని-మోడీని ఢీకొట్టగలరా: రమ్య రాకతో మారిన సీన్! ఆమె ముందు సవాళ్లు
Recommended Video

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని సాధించిపెట్టడమే లక్ష్యంగా సోనియా గాంధీ నుంచి వారసత్వ పగ్గాలు అందుకునేందుకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష పదవికి రాహుల్ మినహా ఎవరూ పోటీలో లేరు.
దీంతో రాహుల్ గాంధీ ఎన్నిక లాంఛనమే. దాదాపు ఇరవై ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ నుంచి రాహుల్ ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలకు పడిపోవడం మొదలు ఆ తర్వాత ఒక్కో రాష్ట్రాన్ని కమలం ఆక్రమించుకుంటోంది.

మోడీని, బీజేపీని అడ్డుకోగలరా
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా సోషల్ మీడియాలో బీజేపీని, ప్రధాని మోడీని కాంగ్రెస్ అడ్డుకుంటుందా అనే చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు సోషల్ మీడియా కూడా దోహదపడింది. కాంగ్రెస్ ఇటీవలి వరకు సోషల్ మీడియా బీజేపీ అంత యాక్టివ్గా లేదనే చెప్పాలి.

రమ్య చేతికి వచ్చాక దూకుడు
సోషల్ మీడియా కర్నాటకకు చెందిన మాజీ ఎంపి, నటి రమ్య చేతికి వచ్చిన తర్వాత మాత్రం కాంగ్రెస్ ఎంతో యాక్టివ్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీతో పోటీ పడేందుకు రమ్య, ఆమె టీం పని చేస్తోంది.

రమ్యకు పూర్తి స్వేచ్ఛ
గతంలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాన్ని రోహతక్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా చూసేవారు. ఆ స్థానంలో రమ్యను తీసుకు వచ్చారు. సోషల్ మీడియా టీం కూర్పులో రమ్యకు రాహుల్ గాంధీ స్వేచ్ఛను ఇచ్చారు. దీంతో కొన్ని నెలల్లోనే ఆమె ఫలితం చూపించారు.

రమ్య బృందంలో మహిళలు
రమ్య సోషల్ మీడియా బృందంలో 85 శాతం మంది వరకు మహిళలే ఉన్నారు. సోషల్ మీడియా విభాగంలో రమ్య అడుగుపెట్టినప్పుడు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు అన్ని వార్ రూంలో జరుగుతాయి. సోషల్ మీడియా విభాగం కోసం డిజిటల్ వార్ రూంను ఏర్పాటు చేశారు.

బీజేపీకి కౌంటర్లు డిజిటల్ వార్ రూం నుంచే
ప్రస్తుతం బీజేపీకి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న కౌంటర్లు అన్నీ ఈ వార్ రూం నుంచే వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏది కరెక్టో, ఏది అబద్దమో తెలుసుకోవడం కత్తిమీద సామే.

రమ్య ముందు ఇదే అతిపెద్ద సవాల్
బీజేపీ, ప్రధాని మోడీని ధీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్ సోషల్ మీడియా ఉండేలా చేయడం రమ్యకు ఓ సవాల్. దాంతో పాటు మరో సవాల్ కూడా ఆమె ముందు ఉంది. చిన్నపొరపాటు చేసినా అది పార్టీ ఇమేజ్కు నష్టం చేకూరుస్తుంది. కానీ రమ్య ఆధ్వర్యంలో పార్టీకి నెగిటివ్ ఇమేజ్ రాకుండా ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికలు మరెంతో దూరం లేనందున కాంగ్రెస్ సోషల్ మీడియా వైపు యువతను ఆకర్షించే పనిలో రమ్య ఉన్నారు.












Click it and Unblock the Notifications