విపక్షాల మెగా ఒప్పందం: 2019లో బీజేపీ లక్ష్యంగా ఏకమవుతున్న పార్టీలు
2019 ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే సమయం ఉంది. అప్పుడే ఆయా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బలమైన బీజేపీని ఢీకొట్టేందుకు విపక్షాలు ఒక్కటవుతున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటుకు అత్యధిక ఎంపీలను పంపే ఉత్తర్ ప్రదేశ్నే ముందుగా ఎంచుకున్నాయి విపక్షాలు. అక్కడ బీజేపీపై పైచేయి సాధించగలిగితే తమకు ఎదురుండదనే భావనలో విపక్ష పార్టీలున్నాయి. ఇందులో భాగంగానే యూపీలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు రాజకీయ ఒప్పందానికి రానున్నట్లు సమాచారం. సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Recommended Video
విపక్ష పార్టీలు ఒక అవగాహనకు రావడంతోనే యూపీలోని గోరఖ్పూర్, ఫూల్ పూర్, కైరానా ,నూర్పూర్ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇదే ఫార్ములాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రయోగించాలని విపక్షాలు భావిస్తున్నాయి. గతవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై చర్చించారు.
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం కాస్త బెడిసికొట్టిందనే చెప్పాలి. అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్లో బీఎస్పీ 50 సీట్లు డిమాండ్ చేస్తుండగా... కాంగ్రెస్ మాత్రం 22 సీట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. అది కాకపోతే గరిష్టంగా 30 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీట్ల పంపకాల్లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అది బీజేపీకి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్లో పొత్తులపై చర్చలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బీఎస్పీ, ఎస్పీ పార్టీల మధ్య మంచి అవగాహన ఒప్పందం ఉంది. ఇందులో భాగంగానే సమాజ్ వాదీ పార్టీ కోటా నుంచి అజిత్ సింగ్ పార్టీ ఆర్ఎల్డీకి కొన్ని సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 8 లోక్ సభ స్థానాలు ఇచ్చేందుకు అక్కడి పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చర్చలు మరింత బలంగా జరిగితే కాంగ్రెస్కు 10 పార్లమెంటరీ స్థానాలకు మించి ఇచ్చేది లేదని అక్కడి పార్టీలు చెబుతున్నాయి. మాయావతి పార్టీ బీఎస్పీ అత్యధిక స్థానాల్లో పోటీచేసేందుకు ఇతర పార్టీలు ఒప్పుకోగా... అఖిలేష్ సమాజ్ వాదీ పార్టీ 32 సీట్లు, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, కేరళలో పొత్తులపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. జార్ఖండ్ తమిళనాడు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న జేఎంఎం, డీఎంకే పార్టీలతో కాంగ్రెస్ కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అంతేకాదు తమిళనాడులోని కమ్యూనిస్ట్ పార్టీలు పార్లమెంటులో కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. బీహార్లో లాలూ పార్టీ ఆర్జేడీతో కాంగ్రెస్ స్నేహం బలంగా సాగుతోంది. నితీష్ కుమార్ బీజేపీ వైపు మొగ్గు చూపడంతో ఆర్జేడీ మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో పొత్తుల విషయంపై ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు అక్కడ చిన్నా చితకా పార్టీలు కూడా హస్తం పార్టీతో కలిసి వెళ్లేందుకు ఓకే చెప్పాయి. ఇప్పటికే శరద్ పవార్తో కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకాలపై చర్చలు జరిపి ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం.