విపక్షాలన్ని ఏకమైతే మోడీని ఓడించగలవా?: 'టైమ్స్ గ్రూప్' సర్వే ఏం తేల్చింది?
న్యూఢిల్లీ: ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉన్నప్పటికీ.. అప్పుడే సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వెల్లడైన కొన్ని సర్వేలు కొన్ని ప్రధాని మోడీకి అనుకూలంగా ఉండగా.. మరికొన్ని ప్రతికూలంగా వెలువడ్డాయి. తాజాగా టైమ్స్ గ్రూప్ నిర్వహించిన మరో సర్వేలోనూ మోడీకి అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి. 8,44,646 మంది అభిప్రాయ సేకరణతో టైమ్స్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో.. 71.9శాతం మంది మళ్లీ మోడీనే ప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే:
ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. మోడీ నేత్రుత్వంలోని ప్రభుత్వానికి ఓటు వేస్తామని 73.36శాతం మంది ఓటర్లు తెలిపారు. ఉన్నపళంగా ఈరోజే లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే ప్రధాని అభ్యర్థిగా మోడీయే 'ది బెస్ట్' అని మెజారిటీ నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని 11.93శాతం మంది మాత్రమే ఓటేశారు. ఇక మోడీ, రాహుల్.. ఈ ఇద్దరూ ప్రధానులుగా అవసరం లేదని 16.1శాతం మంది నెటిజెన్స్ ఓటేశారు.

ఆన్లైన్ పోల్:
ప్రధాని పీఠం ఎక్కి మోడీ నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుండటంతో ప్రభుత్వ పనితీరుపై టైమ్స్ గ్రూప్ మెగా 'పల్స్ ఆఫ్ ది నేషన్' పేరుతో ఆన్లైన్ పోల్ నిర్వహించింది. దేశ వ్యాప్తంగా టైమ్స్ గ్రూప్లోని మొత్తం 9 భాషల్లో ఉన్న మీడియా సంస్థల ద్వారా మే 23 నుంచి 25 వరకు ఈ మెగా పోల్ నిర్వహించారు.

మోడీ పాలన ఎలా ఉంది?:
నాలుగేళ్ల మోడీ ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు.. 47.4శాతం మంది చాలా బాగుందని, 20.6శాతం మంది బాగుందని, 11.38శాతం మంది ఫర్వాలేదని ఓటేశారు. ఇక మోడీ తీసుకున్న అత్యంత విజయ నిర్ణయమేది? అన్న ప్రశ్నకు 33.42 శాతం మంది జీఎస్టీకి ఓటేయడం గమనార్హం. నోట్ల రద్దు ఉత్తమ నిర్ణయమని 21.9శాతం మంది, పాకిస్థాన్పై సర్జికల్ దాడులకు 19.89 శాతం మంది, జన్ ధన్ యోజనకు 9.7 శాతం ఓటేశారు.

దారుణంగా విఫలమైంది ఎక్కడ:
మోడీ సర్కార్ నాలుగేళ్ల పాలనలో ఎక్కడ దారుణంగా విఫలమైందన్న ప్రశ్నకు 'ఉద్యోగాల కల్పన' అన్న సమాధానం ఎక్కువగా వినిపించింది. 28.3శాతం మంది నెటిజెన్స్ ఇదే సమాధానం చెప్పారు. అయితే నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషి ఎలా ఉందన్న ప్రశ్నకు.. 58.4శాతం మంది సంతృప్తికరం అని ఓటేశారు. 36శాతం మంది బాగాలేదని ఓటేశారు.
అలాగే మోడీ ప్రభుత్వం దారుణంగా విఫలమైన నఅంశాల్లో కశ్మీర్ సమస్య కూడా ఒకటని 14.28శాతం మంది ఓటేశారు. నోట్ల రద్దును కూడా చెత్త నిర్ణయమని 22.2శాతం మంది ఓటేశారు. ఇక ఎన్డీయే హయాంలో మైనార్టీల్లో అభద్రత పెరగలేదని 59.41శాతం మంది నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు. అయితే వారిలో అభద్రత పెరిగిందని 30.01శాతం మంది ఓటేశారు.

విపక్షాలన్ని ఏకమైతే మోడీని ఓడించగలవా?:
విపక్షాలన్ని ఏకమైతే మోడీని ఎదుర్కోగలవా? అన్న ప్రశ్నకు 28.96శాతం మంది మాత్రమే అవునని ఓటేశారు. విపక్షాలు బీజేపీని ఓడించలేవని 57.11శాతం మంది ఓటేశారు. 13.92శాతం మంది 'చెప్పలేం' అని సమాధానం ఇచ్చారు.
ఇక 2019 సాధారణ ఎన్నికల తరవాత ఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు అన్న ప్రశ్నకు 73.36 శాతం మంది మోడీ సర్కారే అని సమాధానం ఇచ్చారు. థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని 16.04శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక రాహుల్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని 10.59శాతం మంది అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications