బెంగళూర్ పోలీస్ చీఫ్తో భేటీకి టెక్కీ మెహదీ పేరేంట్స్ విజ్ఞప్తి
బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు నియామకాల కోసం ట్విట్టర్ ఖాతను నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న మెహిదీ మస్రూర్ బిశ్వాస్ తల్లిదండ్రులు బెంగళూరు పోలీసు చీఫ్ను కలవడానికి విజ్ఞప్తి పెట్టుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ కోసం ట్విట్టర్ ఖాతాను నడిపిస్తున్నాడనే ఆరోపణపై బిశ్వాస్ను పోలీసులు గత వారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
బిశ్వాస్ తల్లిదండ్రుల విజ్ఞప్తిని బెంగళూర్ పోలీసులు బుధవారంనాడు ధ్రువీకరించారు. నిందితుడి తల్లిదండ్రులను తాము పిలువలేదని, వారంతట వారే బెంగళూర్ వ్చచారని,తనను కలుసుకోవాలని కోరారని, తగిన సమయంలోనూ తగిన స్థలంలోనూ భేటీకి అంగీకరించానని బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి మీడియాకు చెప్పారు.
వారిని ఇంటర్వ్యూ చేయడం గానీ విచారించడం గానీ తన పరిధిలోది కాదని, ఆ విషయాన్ని దర్యాప్తు అధికారులకే వదిలేస్తున్నానని ఆయన చెప్పారు. ఐఎస్ఐఎస్ అనుకూల ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్నాడనే ఆరోపణపై పోలీసులు బిశ్వాస్ను అరెస్టు చేశారు.
@ShamiWitness అనే ట్విట్టర్ ఖాతను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కోసం నడిపిస్తున్నాడంటూ బ్రిటన్కు చెందిన చానెల్ 4 న్యూస్ ప్రసారం చేసిన తర్వాత పోలీసులు అతి వేగంగా స్పందించి బిశ్వాస్ కోసం వేట సాగించి అతన్ని పట్టుకున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తాను ఇస్లామిక్ స్టేట్లో చేరడం లేదని అతను చెప్పుకున్నట్లుగా కూడా చెప్పారు.
పశ్చిమ బెంగాల్కు చెందిన బిశ్వాస్ బెంగళూరులోని ఓ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ వచ్చాడు. పగలంతా ఉద్యోగం చేస్తూ రాత్రుళ్లు ట్విట్టర్ ఖాతను నిర్వహించేవాడని చెబుతున్నారు.