టెంపరేచర్ సున్నా డిగ్రీలు.. యూపీ గజగజ.. వందేళ్ల రికార్డు బద్దలు
జమ్మూకాశ్మీర్, హిమాచప్రదేశ్ తరాహాలో ఉత్తరప్రదేశ్ లో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్ కు చేరింది. గడిచిన 120 ఏండ్లలో యూపీలో రికార్డైన అతి తక్కువ టెంపరేచర్ ఇదే కావడం గమనార్హం. మంగళవారం ఉదయం కాన్పూర్ లో టెంపరేచర్ సున్నా డిగ్రీని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యూపీ రాజధాని లక్నో కూడా సున్నాకు చేరువగా.. 0.7 డిగ్రీలు నమోదైనట్లు చెప్పారు.
అన్ని చోట్లా 3 డిగ్రీల లోపే..
బెహ్రెయిచ్ లో 0.2 డిగ్రీలు, జాన్సీలో 1.8, బారబంకిలో 1.6, అమేథీలో 1.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైందన్న అధికారులు.. ఫతేపూర్ లో 2.2, సుల్తాన్ పూర్ లో 2.4, బరేలీలో 2.5, సోన్ భద్ర్ లో 2.6, బందాలో మూడు డిగ్రీలు నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో చలి ఇంకా పెరుగుతందని తెలిపారు.
రవాణా వ్యవస్థ అతలాకుతలం
యూపీలోని చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట కూడా టెంపరేచర్ 10 డిగ్రీలు దాటడంలేదు. చలికి తోడు దట్టమైన పొగమంచు ఏర్పడంలో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వందలాది విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిందని, నాలుగు సర్వీసుల్ని రద్దుచేశామని , 20కిపైగా విమానాల్ని దారి మళ్లించామని ఏవియేషన్ అధికారులు చెప్పారు. పొగ మంచు కారణంగా రైలు సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.
జనం ఇబ్బందులు..
చలికి భయపడి జనం ఇంటినుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. పొగమంచుకు కాలుష్యం కూడా తోడుకావడంతో గంగా పరివాహక జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. దీనికితోడు చలిగాలులు బలంగా వీస్తుండటంతో చిన్నారులు, ముసలివాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. చలికి తాళలేక యూపీలో పలు చోట్ల ఆవులు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.