నిపుణుల అభిప్రాయం: వృద్ధి రేటు పెరగాలంటే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం కావాల్సిందే
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగం సామర్థ్యత తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు ఇండియన్ బ్యాంకింగ్ కాన్క్లేవ్లో పాల్గొన్న నిపుణులు. వృద్ధి రేటు పెరగాలంటే బ్యాంకింగ్ సామర్థ్యం సరిగ్గా ఉంటేనే అది సాధ్యపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. పలు వేదికలపై జరిగిన చర్చల్లో బ్యాంకింగ్ రంగాన్ని కార్యకలాపాలను మరింత పటిష్టం చేయడంతో పాటు, బలోపేతం చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.అవసరమైతే బ్యాంకులన్నిటినీ కలిపి మూడు బ్యాంకులుగా విలీనం చేయాలని... డజను బ్యాంకుల కంటే ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ వ్యవస్థలో పరిపూర్ణమైన మార్పులు తీసుకురావాలని నీతిఆయోగ్ వైస్ ఛైర్మెన్ రాజీవ్ కుమార్ సలహా ఇచ్చారు.
విదేశీ బ్యాంకులైనా, ప్రభుత్వ రంగ బ్యాంకులైనా ప్రైవేట్ రంగ బ్యాంకులైనా అన్నిటిలోనూ మార్పులు తీసుకురావాలని చెప్పిన రాజీవ్ కుమార్... బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వం కొంత దూరం పాటిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంక్లేవ్లో మాట్లాడిన రాజీవ్ కుమార్ బ్యాంకింగ్ రంగం బలోపేతం అయితేనే దేశంలో వేగవంతమైన వృద్ధి రేటు నమోదవుతుందన్నారు. వృద్ధిరేటును వేగవంతంగా పయనించేలా చేయాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని లోపాలను సరిదిద్దాలని ఓ ప్రైవేట్ బ్యాంకు డైరెక్టరు చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 100 సంస్థల్లో మన దేశానికి సంబంధించిన ఒక్క బ్యాంకు కూడా స్థానం సంపాదించుకోలేదని అన్నారు నీతిఆయోగ్ వైస్ ఛైర్మెన్ రాజీవ్ కుమార్. అయితే ఎస్బీఐ మాత్రం 250 నుంచి 300 మధ్య స్థానం నమోదు చేసుకుందన్నారు. మరోవైపు పొరుగు దేశమైన చైనాకు చెందిన ఏడు బ్యాంకులు టాప్ 100లో చోటు సంపాదించాయని తెలిపారు. మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా లేనందువల్లే వృద్ధి రేటు అనుకున్నంత స్థాయిలో ఉండటం లేదని రాజీవ్ కుమార్ చెప్పారు.
చైనాకు చెందిన రెండు బ్యాంకులు ఇచ్చే రుణాలు ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణాలకన్నా ఎక్కువగా ఉన్నాయన్నారు రాజీవ్ కుమార్. 2030 కల్లా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని చెబుతున్న మనం... బ్యాంకింగ్ రంగం బలోపేతం కాకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడదని రాజీవ్ కుమార్ వివరించారు. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే సమయం ఆసన్నమైందా అని ప్రశ్నించిన రాజీవ్... అన్ని 26 బ్యాంకులను రెండు లేదా మూడు బ్యాంకులుగా విలీనం చేస్తే ప్రపంచ ర్యాంకింగ్లో మంచి స్థారం సంపాదిస్తామని చెప్పారు.
ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసే కార్యక్రమం ఎస్బీఐ చేసిందని ప్రస్తుతం అది ఇంకా ప్రాసెస్లో ఉందని ఇప్పటికే విలీనం పూర్తయిన బ్యాంకుల పనితీరు బాగానే ఉందని గోపాల్ కృష్ణ అగర్వాల్ స్పష్టం చేశారు. బ్యాంకుల విలీనం చాలా కాలంగా కొనసాగుతోందని అయితే దాన్ని నుంచి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఫలితాలు కనపడలేదని సమాచారం. బ్యాంకుల విలీనంపై కాంక్లేవ్లో తారాస్థాయిలో చర్చ జరిగన నేపథ్యంలో బ్యాంకుల విలీనం నివేదిక ప్రభుత్వానికి నీతి ఆయోగ్, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్లు అందించే అవకాశం కనిపిస్తోంది.