విభజన సమస్యలపై కేంద్రం మరో భేటీ- ఈనెల 23న ఢిల్లీలో- ఆ డెడ్ లైనే కారణం !
ఏపీ, తెలంగాణ మధ్య విభజన జరిగి 8 ఏళ్లు దాటిపోయింది. మరో 20 నెలలైతే విభజనకు పదేళ్లు పూర్తవుతాయి. ఈ లోపు విభజన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో భేటీకి సిద్ధమైంది. ఈ నెల 23న ఢిల్లీకి రావాలని ఇరు తెలుగు రాష్ట్రాలకు సమాచారం పంపింది.
తాజాగా సెప్టెంబర్ 27న ఢిల్లీలో హోంశాఖ భేటీ నిర్వహించింది. ఇందులో విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపింది. ఈ భేటీలో ఉమ్మడి సమస్యలతో పాటు ఏపీకి చెందిన 7 సమస్యలపై చర్చించారు. అయితే ఇందులో ఏపీ తరఫున లేవనెత్తిన అంశాల్లో ఏ ఒక్కదానికీ కేంద్రం పరిష్కారం చూపలేకపోయింది. అలాగే పాత హామీల అమలుకు కొత్తగా హామీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో పాటు ఏపీ రాజధానికి నిధుల కేటాయింపు కూడా చర్చకు వచ్చింది. అయితే కేంద్రం మాత్రం అమరావతికి నిధులు ఇవ్వబోమని తెలిపింది.
సీఎం జగన్ గతంలో ప్రధానిని కలిసినప్పుడు అమరావతికి నిధులు ఇవ్వొద్దని కోరినట్లు కేంద్ర హోంశాఖ గత భేటీలో ఏపీ అధికారులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అమరావతికి నిధులు నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారమేదీ లేదు. అయితే పెండింగ్ లో ఉన్న మిగతా అంశాలపై ఈసారి భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇందులో రెవెన్యూ లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాలున్నాయి.