అర్దరాత్రి ఢిల్లీ శివార్లలో ఎన్ కౌంటర్: అరెస్టు
ఘజియాబాద్: సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల తరువాత ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మిగిలిన నిందితులు తప్పించుకుని పరారైనారని అధికారులు తెలిపారు.
ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీస్ చెక్ పోస్టు వద్ద ఆదివారం అర్దరాత్రి దాటిన తరువాత ఈ ఎన్ కౌంటర్ జరిగిందని అధికారులు అంటున్నారు. సంఘటనా స్థలంలో అధికారులు ఓ పిస్తోల్ ను స్వాధీనం చేసుకున్నారు.
గణతంత్ర దినోత్సవం నేపధ్యంలో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అదివారం అర్దరాత్రి ఎన్ కౌంటర్ జరిగిన తరువాత అరెస్టు అయిన అంకిత్ ఓ పేరు మోసిన క్రిమినల్ అని పోలీసు అధికారులు అంటున్నారు.
ఘజియాబాద్ లోని రాజ్ నగర్ చోరీ కేసులో ఇతని పై పోలీసులు రివార్డు ప్రకటించారని అధికారులు చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఢిల్లీలో, జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్సీఆర్) లోనూ హై అలర్ట్ ప్రకటించారు.
గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశంలోని మెట్రో నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపధ్యంలో అన్ని నగరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.