మరో ట్విస్ట్: షీనాను మైకేల్ చంపాడన్న ఇంద్రాణి
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కూతురు షీనా బోరాను హత్య చేసిన తల్లి ఇంద్రాణి ముఖర్జీయా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తన కుమార్తె షీనాబోరాను తన మాజీ భర్త మైఖెల్ హత్య చేశాడని, ఆ సమయంలో తాను సహాయం మాత్రమే చేశానని ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా భర్త పీటర్ ముఖర్జియాకు తెలిపినట్లు తెలిసింది.
2012లో జరిగిన షీనాబోరా హత్య కేసుకు సంబంధించి షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్రాయ్లను 2015 ఆగస్టులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె నేరాన్ని అంగీకరించలేదు.
కాగా, జైలుకు తీసుకెళ్లిన తర్వాత పీటర్ ముఖర్జియా ఓసారి ఆమెను జైలులో కలిశారు. ఆ సమయంలో అతనితో ఇంద్రాణి మాట్లాడుతూ.. షీనాను తాను హత్య చేయలేదని, మైఖెలే చేశాడని తెలిపారు. షీనా మృత దేహాన్ని కనిపించకుండా చేసేందుకు మాత్రమే సహాయపడినట్లు ఆయనతో చెప్పారని పీటర్ సోదరుడు గౌతమ్ ముఖర్జియా తెలిపారు.
అనవసరంగా తన సోదరుడు పీటర్ను ఈ కేసులో ఇరికించారని, 250 ఆధారాలు ఉన్నా అందులో ఏ ఒక్కటీ పీటర్ పాత్ర ఉందని రుజువు చేయలేకపోతున్నాయని అన్నారు.