సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై లష్కరే ఉగ్రవాదుల మెరుపుదాడి .. ఒక జవాన్ మృతి, మరోముగ్గురికి గాయాలు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల షోపియాన్ జిల్లాలో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు హతమార్చిన నేపథ్యంలో తాజాగా సీఆర్పీఎఫ్ సిబ్బంది కాన్వాయ్ పై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు.
శ్రీనగర్ శివార్లలో లావేపోరాలో సిఆర్పిఎఫ్ సిబ్బంది కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని జమ్మూ కే ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) విజయ్ కుమార్ తెలిపారు.

లావేపోరా మెయిన్ చౌక్ వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రమూక దాడి
ఈ దాడిలో లష్కరే తోయిబా (ఎల్ఇటి) ప్రమేయం ఉందని ఐజి విజయ్ కుమార్ తెలిపారు.సెంట్రల్ కాశ్మీర్ శ్రీనగర్ జిల్లాలోని లావేపోరా ప్రాంతంలోని సిఆర్పిఎఫ్ 73 బెటాలియన్ వద్ద ఉగ్రవాదుల బృందం కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. సంఘటన జరిగినప్పుడు సిఆర్పిఎఫ్ పార్టీ రోడ్ ఓపెనింగ్ పార్టీ (ఆర్ఓపి) విధుల్లో ఉంది. లావేపోరా మెయిన్ చౌక్ వద్ద ఈ సంఘటన జరిగింది.
గాయపడిన నలుగురు సిఆర్పిఎఫ్ జవాన్లను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, వారిలో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి, దీంతో అతను మరణించారు . మరో ముగ్గురు జవాన్లు 92 బేస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఒక జవాన్ మృతి, ముగ్గురికి గాయాలు .. షోపియాన్ ఎన్ కౌంటర్ తర్వాత ఘటన
ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నంలో భద్రతా దళాలు లావేపోరా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో మృతి చెందిన జవాన్ను త్రిపురకు చెందిన ఎఎస్ఐ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) మాంగా రామ్ బార్మన్గా సిఆర్పిఎఫ్ ధృవీకరించింది. జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగినప్పటి నుండి ఇది 48 గంటలలోపు ప్రతీకారం తీర్చుకోవడం లో భాగంగా ఉగ్ర మూక రెచ్చిపోయింది .

షోపియాన్ ఎన్ కౌంటర్ లో నలుగురు లష్కరే ఉగ్రమూక హతం
మార్చి 22 న, జమ్మూ కాశ్మీర్లోని షోపియన్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. షోపియన్లోని మణిహాల్ ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. షోపియన్ పోలీసులు, ఆర్మీ ప్రారంభించిన ఆపరేషన్ సందర్భంగా ఈ దాడి జరిగిందని జెఅండ్కె పోలీస్ డిజి దిల్బాగ్ సింగ్ తెలిపారు. షోపియాన్ జిల్లా ఉగ్రవాదుల స్థావరంగా మారిన నేపథ్యంలో అడుగడుగున జల్లెడ పడుతున్న భద్రత దళాలు ఇప్పటికే ఉగ్రవాదుల నెట్ వర్క్ సభ్యులను అరెస్ట్ చేయడమే కాకుండా, ఉగ్రవాదుల ఏరివేత పై దృష్టిపెట్టారు.












Click it and Unblock the Notifications