కాశ్మీర్ పోలీస్ పోస్ట్లపై ఉగ్రవాదుల దాడి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పోలీసుల మీద కాల్పులు జరుపుతున్నారు. కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు పోలీస్ పోస్ట్ ల మీద కాల్పులు జరిపారు. తజ్జూర్ షరీఫ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు.
తజ్జూర్ షరీఫ్ ప్రాంతంలోని మసీదు సమీపంలో ఉన్న దేవాలయాలకు రక్షణ కల్పించడానికి పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేశారు. మంగళవారం పోలీసులు అక్కడ భద్రతా ఎర్పాట్లలో నిమగ్నం అయ్యారు. అదే సమయంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.
అత్యాధునిక తుపాకులతో కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడి నుండి కాలికి బుద్ది చెప్పారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో ఇద్దరు పోలీసులకు గాయాలైనాయని అధికారులు తెలిపారు.
ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత చర్యగా ఆ పరిసర ప్రాంతాలకు అదనపు బలగాలు తరలించారు. సోమవారం అర్దరాత్రి నుండి పాక్ సైన్యం భారత్ సరిహద్దులలో కాల్పులు జరిపింది.
మంగళవారం ఉదయం వరకు ఆరు సార్లు కాల్పులు జరిపింది. పాక్ సైన్యం జరిపిన కాల్పులలో ఇద్దురు పౌరులకు గాయాలైనాయి. భారత్ సైన్యం పాక్ జవాన్లకు దీటుగా సమాధానం ఇస్తున్నది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పాక్ 192 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని భారత్ సైన్యం గుర్తించింది.