అమిత్ షాపై కాంగ్రెస్ మండిపాటు .. వాయుసేన దాడులను రాజకీయం చేస్తున్నారని మండిపాటు
న్యూఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్ర మూకలు చేసిన దాడికి ప్రతీకారంగా వైమానిక దళం చేసిన దాడులకు రాజకీయ రగడ కొనసాగుతోంది. బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరంపై దాడిచేశాక స్వయంగా విదేశాంగ ప్రకటన చేస్తూ .. ఉగ్రవాదులు, శిక్షణ ఇచ్చేవారు .. తదితరులు మృతిచెందారని పేర్కొన్నారు. కానీ అందుకు విరుద్దంగా బీజేపీ చీఫ్ అమిత్ షా మాట్లాడటంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధానికి కారణమైంది.
250 మంది ఉగ్రవాదులు చనిపోయారా ?
బాలకోట్ లో వాయుసేన చేసిన దాడిలో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఆదివారం అమిత్ షా వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది. పుల్వామాలో 40 మంది జవాన్లు చనిపోయినందుకు ప్రతీకార చేపట్టిన వాయుసేన దాడులను రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నించింది. ఐఏఎఫ్ చెప్పినదానికి .. అమిత్ షా చెప్పినదానికి పొంతనే లేదన్నారు కాంగ్రెస్ నేత మనీశ్ తివారి. వైమానిక దళ దాడులను మీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఏంటని నిలదీశారు.
మృతులకు సంబంధించి ఆధారాలేవీ ?
ఇటు మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబాల్ కూడా ధ్వజమెత్తారు. వైమానిక దళం చేసిన దాడిని ... రాజకీయాల కోసం వాడుకోవడం ఏంటని మోదీని ప్రశ్నించారు. మరోవైపు బాలకోట్ దాడుల్లో ఉగ్రవాదులు చనిపోయినట్టు ఆధారాలు ఏం దొరకలేదని విదేశీ మీడియా కోడై కూస్తుందని పేర్కొన్నారు.
మృతుల ఘటనను హోంశాఖ ఖండించింది : చిదంబరం
మరోవైపు మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇటీవల జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో ఉగ్రవాదులు 350 మంది వరకు చనిపోయారని వార్తలొచ్చాయన్నారు. ఉగ్రవాదుల మృతికి సంబంధించి ఆధారాలేంటీ ? అధికార పార్టీ ఎలా నిర్ధారించిందని సూటిగా ప్రశ్నించారాయన. అలాగే 350 మంది ఉగ్రవాదులు, లేదంటే పౌరులు చనిపోయారనే అంశాన్ని కేంద్ర హోంశాఖ ఖండించిందనే విషయాన్ని ట్వీట్ చేశారు. ఓ సాధారణ పౌరుడిగా ప్రభుత్వం చెప్పే అంశాన్ని గౌరవిస్తావని, అయితే ఈ అంశాలను ప్రపంచం కూడా చూస్తోందని, ..యావత్ జాతి విశ్వసించాలని సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వం చెప్పే ప్రతి అంశం సునిశీతంగా నిర్ధారించుకున్నాకే .. ప్రకటించాలి తప్ప ... ఊరికే ప్రకటనలు చేయొద్దని సూచించారు.