‘కనీస విద్యార్హత అమలైతే సగంమంది పోటీలో ఉండరు’
న్యూఢిల్లీ: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్నవారికి కనీసం పదోతరగతి విద్యార్హత ఉండాలనే నిబంధనను వర్తింపజేస్తే సగానికి సగం మంది పోటీ చేయలేని పరిస్థితి వస్తుందని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఈ నిబంధనపై హర్యానా ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోగోరింది.
'మన దేశంలో అక్షరాస్యత ఎంత? ఎన్నికల్లో పోటీ చేయడానికి విద్యార్హతలను ప్రామాణికంగా నిర్ణయించాలన్న అంశంపై మేం నిజంగా ఆందోళనతో ఉన్నాం' అని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎం.ఎం.సప్రేలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
పంచాయతీ ఎన్నికల్లో పోటీకి కనీస విద్యార్హత ఉండాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సెప్టెంబర్ 17న ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోరారు.
కాగా, ఎన్నికలను వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ధర్మాసనం సూచించింది.
క్యాట్ రిజిస్ట్రేషన్ 25 వరకు పొడిగింపు
దేశంలోని 19 ఐఐఎంలతోపాటు వివిధ వర్సిటీల్లో ఎంబీఏ అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘క్యాట్' రిజిస్ట్రేషన్ గడవును సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు. పరీక్షను నవంబరు 29న నిర్వహిస్తారు.
ఈ ఏడాది నుంచి పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రెటేషన్, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్లకు అదనంగా రీడింగ్ కాంప్రహెన్షన్ను ప్రవేశపెట్టారు. పరీక్ష జరిగే సమయాన్ని 170 నిమిషాలనుంచి 180 నిమిషాలకు పెంచారు. అలాగే ఈ ఏడాది నుంచి అభ్యర్థులకు కంప్యూటర్లో ఉండే కాలిక్యులేటర్ను ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.