రూ. 106 కోట్ల బాకీ: సుజనాపై మారిషస్ బ్యాంక్ పిటిషన్
హైదరాబాద్: కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరిపై మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వైయస్ చౌదరి తమకు రూ.106 కోట్లు బాకీ ఉన్నారని, ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరినా బదులివ్వడం లేదని బ్యాంక్ తన పిటిషన్లో తెలిపింది.
సుజనా ఇండస్ట్రీస్ సంస్థ మారిషస్లో వ్యాపారాభివృద్ధి కోసం 2010లో మా బ్యాంకు నుంచి హెస్టియా హోల్డింగ్ లిమిటెడ్ సంస్థ పేరుతో 100 కోట్ల రుణం తీసుకుందని, దీనికి సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ గ్యారంటీగా ఉందని, ఈ మేరకు ఆ రెండు సంస్థల మధ్య ఒప్పందం కూడా ఉందని పిటిషన్లో మారిషస్ బ్యాంక్ తెలిపింది.

హెస్టియా సంస్థ ఆస్తులన్నీ అమ్మినప్పటికీ తమ బాకీలు తీరవని, 2012 నుంచి హెస్టియా మా బ్యాంకుకు బకాయిలు చెల్లించడం మానేసిందని, దీనిపై గతంలో లండన్లోని క్వీన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, తమకు రూ.105కోట్లతోపాటు 72లక్షలు ఖర్చుల కింద చెల్లించాలని కోర్టు ఆదేశించిందని ఎంసీబీ తన పిటిషన్లో తెలిపింది.
తమ బాకీలు చెల్లించే పరిస్థితిలో లేనందున సుజనా చౌదరికి చెందిన యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆస్తులను విక్రయించి తమ అప్పు తీర్చేలా ఆదేశాలు జారీ చేయాలని మారిషస్ బ్యాంక్ కోరింది.
ఈ తీర్పును హెస్టియా సంస్థ, సుజనా సంస్థలు బేఖాతరు చేసినట్లు మారిషస్ బ్యాంక్ తెలిపింది. దీనిపై విచారణను హైకోర్టు ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications