తమిళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం?
చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం కుదటపడకపోవడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పన్నీరు సెల్వం, పీడుబ్ల్యు శాఖ మంత్రి ఎడప్పాడి పళని స్వామి రాజ్ భవన్ చేరుకుని ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు.
జయలలిత ఆరోగ్యం విషయం, తమిళనాడు రాజకీయాల గురించి ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు క్షుణ్ణంగా వివరించారు. అన్నాడీఎంకేకి చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు గవర్నర్ ను కలవడంతో రాజకీయాలు రసవత్తరంగామారాయి. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉన్న పన్నీర్సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జయలలిత ఇంకా కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సివస్తుందని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో రాజ్భవన్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పన్నీర్ సెల్వానికి గతంలో రెండుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణస్వీకారం చేస్తారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
గతంలో జయలలిత జైలుకు వెళ్లిన సమయంలో తనకు నమ్మకస్తుడైన పన్నీరు సెల్వంను సీఎం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అమ్మ అనుమతితో, అన్నాడీఎంకే నాయకుల సహకారంతో పన్నీరు సెల్వం సీఎం అవుతారని రాజకీయ నాయకులు అంటున్నారు.