న్యూస్ ఛానళ్లకు కేంద్ర ప్రభుత్వం చెక్..!!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ ఛానళ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. మార్గదర్శకాలను ఇచ్చింది. క్రైమ్ న్యూస్ ను ప్రసారం చేయడం, వాటి కవరేజీ విషయంలో ఎలాంటి రాజీధోరణిని ప్రదర్శించట్లేదు కేంద్రం. ఈ విషయంలో న్యూస్ ఛానళ్ల దూకుడుకు చెక్ పెట్టింది. నేర వార్తల కవరేజ్, టెలికాస్ట్ చేయడంలో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని, సంచలనాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని తేల్చి చెప్పింది.
తెలంగాణ కాంగ్రెస్కు వార్ రూమ్ కష్టాలు- సీనియర్ నేతకు షాక్..!!
ఈ మేరకు కేంద్ర సమాచార- ప్రసారాల మంత్రిత్వ శాఖ ఇవ్వాళ మార్గదర్శకాలు, నియమ నిబంధనలను విడుదల చేసింది. దీనికి గల కారణాలను కూడా స్పష్టంగా వివరించిందా మంత్రిత్వ శాఖ. మహిళలు, పిల్లలు, వయోధిక వృద్ధులపై హింసాత్మక కథనాలను ప్రసారం చేయకూడదని తెలిపింది. ప్రమాదాలు, అసహజ మరణాలు, తరచూ చోటు చేసుకునే హింసాత్మక సంఘటనలను కవర్ చేసే సమయంలో నైతిక విలువలను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.
అలాంటి వార్తల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుందని, సదభిప్రాయాన్ని కలిగి ఉండాలని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేసిందా మంత్రిత్వ శాఖ. దేశంలోని అన్ని ప్రైవేట్ శాటిలైట్ ఛానళ్లను దీని పరిధిలోకి తీసుకొచ్చింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (కంట్రోల్) యాక్ట్ - 1995లోని ప్రోగ్రామ్ కోడ్కు ఆయా టీవీ ఛానళ్ల యాజమాన్యం కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
ప్రమాదాలకు సంబంధించిన ఫొటోలను బ్లర్ చేయడం లేదా లాంగ్ షాట్గా వాటిని చూపాల్సి ఉంటుందని ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రమాద ఘటనలు, రక్తసిక్తమైన సంఘటన స్థలం, గాయాలపాలైన వారిని యధాతథంగా ప్రసారం చేసే విధానం.. అసహ్యకరమైనదని, బాధ కలిగించేదని వ్యాఖ్యానించింది. సెన్సేషన్ పేరుతో అవమానకరంగా ప్రసారం చేయడం సరికాదని, అలాంటి వాటిని కవరేజ్ చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంతో పాటు కొన్ని ఇతర నేర కథనాల కవరేజీ, టెలికాస్ట్ ను అసహ్యకరమైనదిగా, హృదయాన్ని కదిలించేదిగా అభివర్ణించిందా మంత్రిత్వ శాఖ. సాధారణంగా టీవీ ఛానళ్లను ఇంటిల్లిపాది కలిసి చూస్తుంటారని, పిల్లలు, మహిళలు, వయోధిక వృద్ధులు తిలకిస్తుంటారని, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని నేర వార్తలను కవరేజ్ చేయాల్సి ఉంటుందని సూచించింది.