కర్ణాటకలో వేడెక్కిన లింగాయత VS వీరశైవ, బీజేపీకి సినిమా, సిద్దూ గేమ్, 14 శాతం ఓట్లు !
బెంగళూరు: కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎత్తులకుపై ఎత్తులు వేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇప్పుడు కుల రాజకీయాలు చెయ్యడానికి తెరలేపారు. లింగాయుత, వీరశైవుల మధ్య చిచ్చు పెట్టడానికి సిద్దం కావడంతో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రి వర్గం సోమవారం లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు వీరశైవులు తెరమీదకు వచ్చారు. 14 శాతం ఓట్లు ఏ పార్టీలకు వెలుతాయో అర్థంకాక రాజకీయ నాయకులు అయోమయంలో పడిపోయారు.
హిందువులను చీల్చారు
లింగాయతలకు ప్రత్యేక మతం కేటాయించి హిందువులను నిలువునా చీల్చుతున్నారని, ఇలాగే చేస్తే సిద్దరామయ్య ప్రభుత్వానికి తగినబుద్ది చెప్పడానికి కర్ణాటకలోని హిందువులు సిద్దంగా ఉన్నారని, అందరూ ఏకం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప పిలుపునిచ్చారు.
వీరశైవులు ఏకం కావాలి
అఖిల భారత వీరశైవ మహాసభ తీర్మానాలకు మొదటి నుంచి బీజేపీ కట్టుబడి ఉందని బీఎస్. యడ్యూరప్ప ట్వీట్ చేశారు. అఖిల భారత వీరశైవ మహాసభ తీసుకున్న తీర్మానాలు అమలు చెయ్యడానికి బీజేపీ సిద్దంగా ఉందని, లింగయతలకు ప్రత్యేక మతం కేటాయించిన సమయంలో అఖిల భారత వీరశైవ మహాసభ అత్యవసర సమావేశం అయ్యి చర్చించి తరువాత ఏం చెయ్యాలో నిర్ణయించాలని బీఎస్ యడ్యూరప్ప పిలుపునిచ్చారు.
బీజేపీకి భారీ దెబ్బ
లింగాయతలను ప్రత్యేక మతం వారిగా గుర్తించే విషయంలో కొన్ని నెలలుగా కర్ణాటక బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మౌనంగా ఉన్నారు. లింగాయతలకు ప్రత్యేక మతం కేటాయించే విషయంలో ఆయన ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.
యడ్యూరప్ప పోరాటం, సిద్దూ విజయం
లింగాయతలకు ప్రత్యేక మతం కేటాయించాలని మొదటి నుంచి (2013) నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప పోరాటం చేస్తున్నారు. అయితే మూడుసార్లు సిద్దరామయ్య మంత్రి వర్గంలో ఈ విషయం చర్చకు వచ్చి చివరికి సోమవారం ఆమోదముద్రపడింది. ఈ దెబ్బతో లింగాయతలు సీఎం సిద్దరామయ్యకు జై అనడంతో ఏం చెయ్యాలో అర్థంకాక బీఎస్. యడ్యూరప్ప సతమతం అవుతున్నారు.
14 శాతం ప్రజలు
కర్ణాటకలో లింగాయత ప్రజలు 14 శాతం మంది ఉన్నారు. లింగాయతలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బీఎస్. యడ్యూరప్ప ఇప్పుడు మౌనంగా ఉన్నారు. 14 శాతం లింగాయత ఓట్లు ఏపార్టీకి వెలుతాయో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల తరువాతే వెలుగుచూడనుంది.