కేంద్ర, రాష్ట్రాల మధ్య సరిపోలని లెక్క: అసలు అంతర్జాతీయ ప్రయాణికులు ఎంత మంది వచ్చారు?
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, సీనియర్ బ్యూరోక్రాట్స్కి, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఓ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో భారతదేశంలోకి అంతర్జాతీయ ప్రయాణికులు ఎంత మంది వచ్చారో.. ఆ లెక్కకు క్వారంటైన్లలో చేరిన వారి సంఖ్యకు సరిపోలడం లేదు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయంపై ఈ లేఖను కేబినెట్ సెక్రటరీ రాశారు.

అంతర్జాతీయ ప్రయాణికుల లెక్కలో తేడా..
అంతర్జాతీయ ప్రయాణికులపై రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెట్టాలని సూచించారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల లెక్కలో తేడా రావడం ఆందోళన కలిగించే అంశమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారానే మనదేశంలోకి కరోనావైరస్ వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.

15 లక్షల మంది దేశంలోని..
జనవరి 18, 2020 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. మార్చి 23, 2020 వరకు ప్రయాణికులను లెక్కిచామని తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఇచ్చిన వివరాల ప్రకారం 15 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుని మనదేశంలోకి వచ్చారు. అయితే, రాష్ట్రాలు, కేంద్రపాలిత పర్యవేక్షించిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఈ సంఖ్యకు తేడా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. పర్యవేక్షణలో ఉన్నవారి సంఖ్యను ఈ లేఖలో పేర్కొనలేదు.

గత రెండు నెలల్లో...
గత రెండు నెలల్లో భారతదేశంలోకి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులను దగ్గరగా పర్యవేక్షించాలని కోరారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఈ విషయంపై పదే పదే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోందన్నారు. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబసంక్షేమ శాఖ సూచనల మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

లెక్క తేల్చాల్సిందే.. లేదంటే..
రాష్ట్రాల సీఎస్లు జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెంచాలని, జనవరి 18 తర్వాత దేశంలోకి ప్రవేశించినవారిని గుర్తించి కరోనా అనుమానితులను క్వారంటైన్ చేయాలన్నారు. రాష్ట్రాలు అందించిన వివరాలు అంత ఖచ్చితంగా లేవని, మరోసారి పర్యవేక్షించాలన్నారు. కేంద్రం జాబితాలో ఉన్న 500లో బీహార్ రాష్ట్రంలో 385 మందిని గుర్తించారని, మిగితా వారి సమాచారం లేదని అన్నారు.

కరోనా పాజిటివ్ వ్యక్తులు తిరిగితే వ్యాపించే అవకాశం
కేంద్రం సూచనలతో జిల్లా, పట్టణ, గ్రామీణ స్థాయిలో యంత్రాంగాన్ని ఉపయోగించాలన్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులు సమాజంలో తిరిగితే మరింత వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా దేశంలో ఇప్పటికే 750 మందికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 మందికిపైగా మరణాలు సంభవించాయి. కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications