ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా-విపక్షాల భేటీకి పవార్ పిలుపు-ఎవరెవరికి ఆహ్వానం-కాంగ్రెస్ను దూరం పెడుతున్నారా?
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నేత్రుత్వంలో కేంద్రంలోని ఎన్డీయేకి ధీటుగా ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. సోమవారం(జూన్ 21) ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో భేటీ అనంతరం మంగళవారం(జూన్ 22) విపక్షాల భేటీకి శరద్ పవార్ పిలుపునిచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలతో కొత్త కూటమికి శరద్ పవార్ ప్లాన్ చేస్తున్నారు. రేపటి విపక్షాల భేటీకి 15 పార్టీల నేతలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.
ఎవరెవరికి ఆహ్వానం...
ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో పాటు మాజీ బీజేపీ నేత,ప్రస్తుత టీఎంసీ నేత యశ్వంత్ సిన్హాల తరుపున విపక్ష పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఆహ్వానం అందుకున్నవారిలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్,ఆర్జేడీ నేత మనోజ్ ఝా,కాంగ్రెస్ నేతలు వివేక్ టంఖా,కపిల్ సిబల్,నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ రిటైర్డ్ న్యాయమూర్తి ఏపీ సింగ్,గేయ రచయిత జావెద్ అఖ్తర్,ప్రముఖ న్యాయవాది కేటీఎస్ తులసి,మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ,జర్నలిస్టులు కరణ్ థాపర్,ప్రతీష్ నంది ఆహ్వానం అందినవారిలో ఉన్నారు.
కాంగ్రెస్ను దూరం పెడుతున్నారా..?
దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై రేపటి సమావేశం జరగనుందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. విపక్షాలను ఏకం చేసేందుకు పవార్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్య వేదిక అవసరమని అబిప్రాయపడ్డారు. దీనిపై పవార్తో తాను కూడా చర్చించినట్లు తెలిపారు.కాగా, రేపటి విపక్షాల భేటీకి కాంగ్రెస్కు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్కు చెందిన నానా పటోల్ స్పందిస్తూ...'ప్రజాస్వామ్యంలో తమకు నచ్చనిది చేసే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. మేమెవరినీ ఆపదలుచుకోలేదు. కానీ కాంగ్రెస్ లేకుండా ఏ ఫ్రంట్ ఉండదు.' అని చెప్పారు. అంతేకాదు,పవార్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేయడం ఇదే మొదటిసారేమీ కాదన్నారు.
Recommended Video
యూపీ ఎన్నికలపై కూడా చర్చించే ఛాన్స్...
ఇదే నెలలో శరద్ పవార్-ప్రశాంత్ కిశోర్ మధ్య భేటీ జరగడం ఇది రెండోసారి. ఈ నెల 11వ తేదీన ఈ ఇద్దరు భేటీ అయి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికపై చర్చించారు. తాజా సమావేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకతపై చర్చించినట్లు తెలుస్తోంది. రేపటి సమావేశంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థితో పాటు,వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవార్ నేత్రుత్వంలో ఏర్పడబోయే ప్రత్యామ్నాయ ఫ్రంట్లో చేరేందుకు ఇప్పటికే చాలా పార్టీలు సంకేతాలు పంపించాయని తెలుస్తోంది.