షాక్: ప్రధాని మోడీపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు
చెన్నై: సినిమా నటులను కలవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీకి సమయం ఉంటుందని, అయితే తమిళనాడుకు చెందిన ఎంపీలను కలవడానికి మాత్రం ఆయనకు సమయం ఉండదని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మండిపడ్డారు.
మా రాష్ట్రానికి చెందిన ఎంపీలకు ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు. జల్లికట్టు సాహస క్రీడకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే పార్టీ ఆందోళన నిర్వహించింది.

ఈ సందర్బంగా ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ రజనీకాంత్, అమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, గౌతమి లాంటి సినిమా నటులకు వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తారని ఎంకే స్టాలిన్ ఎద్దేవ చేశారు.
అయితే తమిళనాడు వారసత్వ క్రీడ జల్లికట్టు విషయంపై మాట్లాడేందుకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలకు ఎందుకు అపాయింట్ ఇవ్వలేదని ప్రధాని మోడీని ప్రశ్నించారు. అన్నాడీఎంకే ఎంపీలు అడిగిన రోజు కాకుంటే మరుసటి రోజు అయినా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు.
తమిళ ప్రజలు సంవత్సరానికి ఒక్క సారి వారసత్వ క్రీడ జల్లికట్టు నిర్వహించుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. జల్లికట్టు విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, వెంటనే ప్రధాని మోడీని కలిసి జల్లికట్టు విషయంపై చర్చించాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications